భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్ తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఓట్ల కౌంటింగ్ సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎన్నికల అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా తాజాగా రాష్ట్ర సచివాలయం నుంచి ఏపీలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు పై ప్రత్యేక వీడియో కాన్పరెన్సు నిర్వహించారు.
వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4 న జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎటు వంటి వివాదాలకు తావులేకుండా సంబంధిత వివరాలను అంటే ఏ రోజున, ఎన్నిక గంటలకు, ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతున్నది అనే వివరాలను రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డ్ లను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరు వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లును ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లును ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టాలని, ఆ తదుపరే ఈవీఎంల వారీగా పోల్ అయిన ఓట్లను లెక్కించాలన్నారు.
ఓట్ల లెక్కింపుకు సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని, వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ముందుగానే నిర్వహించాలన్నారు. అదే విధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్స్ ను కౌటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని, కౌటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్స్ డిపాజిట్ కు ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను, అనధికార వ్యక్తులను, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంగణాల్లోకి అనుమతికుంచ కుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు.
ఈవీఎం లను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడు అంచెల భద్రత కొనసాగుతున్నదని, అయితే స్ట్రాంగ్ రూమ్లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు. భద్రత పర్యవేక్షణపై పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు వారి జిల్లాలనుండి ఈ వీడియో కాన్పరెన్సు లో పాల్గొన్నారు.