Homebreaking updates newsTatkal Tickets: తత్కాల్ టికెట్స్ బుకింగ్‌లో కీలక మార్పులు

Tatkal Tickets: తత్కాల్ టికెట్స్ బుకింగ్‌లో కీలక మార్పులు

భారత్ సమాచార్.నెట్: రైలు ప్రయాణికుల (Railway Passengers)కు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తత్కాల్ రైల్వే టికెట్ల (Tatkal Tickets Booking) బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ప్రయాణికుల గుర్తింపు, టికెట్ మాఫియాల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. జూలై 1వ నుంచి తత్కాల్ టికెట్లను బుక్ చేయాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరని రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లకు కొత్త సర్క్యులర్‌ జారీ చేశారు. రైల్వే నిర్ణయంతో ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత సులభం కానుంది.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ముందుగా ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది పూర్తిగా బాధ్యతాయుతమైన టికెట్ బుకింగ్ వ్యవస్థకు దారి తీస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీని కూడా తప్పనిసరి చేస్తున్నారు. అంటే టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది.
తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 30 నిమిషాల వరకు రైల్వే అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయకుండా రైల్వే మంత్రిత్వ శాఖ పరిమితి విధించింది. ముఖ్యంగా ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు ఎయిర్ కండిషన్డ్​ తరగతులకు, ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు నాన్​ ఎయిర్ కండిషన్డ్ తరగతులకు ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ కొత్త వ్యవస్థకు అవసరమైన మార్పులు చేయాలని, ఈ మార్పులను అన్ని జోనల్ రైల్వేలకు తెలియజేయాలని రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్​ సెంటర్​, ఐఆర్‌సీటీసీలకు ఆదేశాలు జారీ చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ.
RELATED ARTICLES

Most Popular

Recent Comments