భారత్ సమాచార్, జాతీయం ;
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా 96 లోక్సభ నియోజకవర్గాలకు నేడు (మే 13 వ తేదీన) పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ఇప్పటికీ ప్రశాంతంగా సాగుతోంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లు, ఒక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఏపీలోని 169 నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ను నిర్వహిస్తారు.
పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుపుతారు.
నేటి ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి అన్ని పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. కొన్ని చోట్ల తీవ్ర మైన ఎండను సైతం లెక్కచేయలేదు. మరికొన్ని చోట్ల వర్షంలో కూడా తడుస్తూ క్యూ లైన్లో ఉంటూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆంధప్రదేశ్ లో 68.12 శాతం, తెలంగాణలో 61.39 శాతం ఓటింగ్ నమోదైంది. పూర్తి స్థాయిలో పోలింగ్ నమోదు అయిన తర్వాత ఓట్ల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74.06 శాతం.. విశాఖ జిల్లాలో అత్యల్పంగా 57.42 శాతం పోలింగ్ నమోదైంది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో 4 గంటలతో పోలింగ్ ముగిసింది. అయితే క్యూ లైన్లలో ఉన్నవారికి మాత్రం ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు.
సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కచ్చితంగా కల్పిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పటికి 2వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతున్నట్లు ఈసీ వెల్లడించింది. గత ఎన్నికలు కంటే ఈ సారి ఎక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. పూర్తి స్థాయి పోలింగ్ సమాచారం మంగళవారం ఉదయానికి అందే అవకాశాలు ఉన్నాయి.