Homemain slidesరాష్ట్ర కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ

రాష్ట్ర కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ

భారత్ సమాచార్, జాతీయం ;

చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి, రామోజీరావుకి ఉన్న అనుబంధం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గురువారం నిర్వహిస్తున్నఈ సంస్మరణ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానుండటంతో పర్యవేక్షణ కోసం ఐదుగురు మంత్రులతో కమిటీ ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మెమోను కూడా జారీ చేసింది. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణకు సముచిత ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, విభాగ అధిపతులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సమాజానికి, మీడియా, సినీ రంగాలకు చేసిన విశేష సేవలకుగాను ఆయన గౌరవార్థం సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది.

విజయవాడలోని కానూరులో ఉన్న అనుమోలు గార్డెన్స్‌లో గురువారం సాయంత్రం 4 గంటలకు సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు కమిటీ సభ్యులు వ్యవహరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. మంత్రుల కమిటీకి సహకరించేందుకు అధికారులతో మరో కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీకి సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లు, విజయవాడ పోలీసు కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఏపీసీపీడీసీఎల్​ సీఎండీతోపాటు మరికొందరు అధికారుల్ని కమిటీలో సభ్యులుగా నియమించింది. సభ నిర్వహణ ఏర్పాట్లపై కమిటీలోని మంత్రులు వెలగపూడి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన వేదిక, దాని ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లు, హాజరుకానున్న ప్రముఖులకు వసతి, రవాణా, ఇతర ఏర్పాట్లను అధికారులు వివరించారు.

“రామోజీరావు తెలుగు జాతికి బ్రాండ్‌ అంబాసిడర్‌. క్రమశిక్షణ, కష్టపడే తత్వానికి నిలువుటద్దం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికారంగం ద్వారా ప్రజలను చైతన్యపరచడానికి ఎంతో కృషి చేశారు. ప్రసార మాధ్యమంలోనూ అదే తీరు కొనసాగించారు. హాలీవుడ్‌ స్థాయిని మించి రామోజీ ఫిలింసిటీని నిర్మించారు. సినీరంగ అభివృద్ధికీ కృషి చేశారు. ఏ రంగాన్ని తీసుకున్నా ఆయన విజయాల పరంపరే కనిపిస్తుంది. తెలుగు జాతి స్ఫూర్తి ఆయన. భావితరాలకు ఆదర్శం. అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించేలా సంస్మరణ సభను నిర్వహిస్తున్నాం.” మంత్రి నిమ్మల రామానాయుడు.

రామోజీరావు జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్​తోపాటు ఆడియో, వీడియో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. దాదాపు 7 వేల మంది ఆహ్వానితులు పాల్గొంటారన్నారు. “కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించిన రామోజీరావు.. పత్రికారంగం ద్వారా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రజల పక్షాన నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రభుత్వాలను నిలదీశారు. నిరక్షరాస్యులైన రైతులు, మహిళలతోపాటు అన్ని వర్గాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను ఈటీవీలో ప్రసారం చేశారు. సినీ రంగానికి ఎనలేని కృషి చేశారు. క్రమశిక్షణకు ఆయన పర్యాయపదం. సభకు రైతులూ వచ్చి ఆయనకు ఘన నివాళులర్పిస్తారు.” – మంత్రి కొల్లు రవీంద్ర.

మరోవైపు అనవసర ఆర్భాటాలతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని
విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.

మరికొన్ని విశేషాలు…

ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్…

RELATED ARTICLES

Most Popular

Recent Comments