భారత్ సమాచార్, విద్య ;
దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్–2025 కు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఇక్కడి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయికి మించి విద్యాభ్యాసం, వసతి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. సీబీఎస్ఈ సిలబస్ లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా భోదన ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో -15, తెలంగాణ లో -09 జవహార్ విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ పోటీ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు కచ్చితంగా ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతూ ఉండాలి. 01.05.2013 వ తేదీ నుంచి 31.07.2015 తేదీ మధ్యలో జన్మించిన విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయటానికి అర్హులు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను 80 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ విభాగం నుంచి(40 ప్రశ్నలు, 50 మార్కులు), అర్థమేటిక్ (20 ప్రశ్నలు, 25 మార్కులు), లాంగ్వేజ్(20 ప్రశ్నలు, 25 మార్కులు) సబ్జెక్ట్లు ఉంటాయి. ఓఎంఆర్ సీట్లో నాలుగు ఆప్షన్స్లో ఒకటి సమాధానం పెన్ సాయంతో దిద్దాలి. బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను మాత్రమే ఉపయోగించాలి. పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది. పరీక్ష రాయటానికి అర్హతలు గల విద్యార్థులు దరఖాస్తులను కచ్చితంగా ఆన్ లైన్ ద్వారా మాత్రమే చేయాలి. దరఖాస్తు చేయటానికి చివరి తేదీ 16.09.2024. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ www.navodaya.gov.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.