భారత్ సమాచార్.నెట్,శబరిమల: అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) భక్తులకు (Devotees) ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (Travancore Devaswom Board) శుభవార్త చెప్పింది. అయ్యప్ప రూపంలో ఉన్న బంగారు లాకెట్ల (Golden Locket) పంపిణీని పవిత్ర విషు పర్వదినం సందర్భంగా ట్రావెన్కోర్ దేవస్థానం ప్రారంభించింది. మలయాళ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలోని మొదటి రోజు విషు. శబరిమల (Sabarimala) ఆలయ గర్భ గుడిలో బంగారు లాకెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. పూజలు అనంతరం ఆ లాకెట్లను కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ ఈ లాకెట్లను భక్తులకు అందజేశారు. దీంతో చాలాకాలంగా ఉన్న అయ్యప్ప భక్తుల డిమాండ్ నేరవేరింది.
లాకెట్లను దేవస్థానం ఆన్లైన్ ద్వారా భక్తులకు విక్రయిస్తోంది. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన తొలి లాకెట్ను ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తుడికి అందజేశారు. ఆ తర్వాత శబరిమల తంత్రి (ప్రధాన పూజారి) కందరారు రాజీవరు, టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, బోర్డు సభ్యుడు ఏ అజికుమార్ మిగిలిన భక్తులకు లాకెట్లను పంపిణీ చేశారు. ఇక బంగారు లాకెట్ను ఆలయ పవిత్ర గర్భగుడి లోపల పూజలు నిర్వహించి భక్తులకు అందజేస్తారు. ఇలా చేయడం వల్ల భక్తులకు అదనపు ప్రత్యేకతను ఇస్తుందని దేవస్థానం పేర్కొంది.
అయ్యప్ప లాకెట్లను 2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాముల్లో తయారు చేశారు. అయితే 2 గ్రాముల బంగారు లాకెట్ ధర రూ.19,300గా నిర్ణయించారు. 4 గ్రాముల లాకెట్ ధర రూ.38,600, 8 గ్రాముల బరువున్న బంగారు లాకెట్ ధర రూ.77,200గా శబరిమల దేవస్థానం నిర్ణయించింది. రెండు రోజుల కిందట బుకింగ్ ప్రారంభం కాగా మొత్తం 100 మంది భక్తులు ఆ లాకెట్లను బుక్ చేసుకున్నారు. ఇక ఈ బంగారు లాకెట్లను భక్తులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కొనుగోలు చేసుకొచ్చు. తమిళనాడుకు చెందిన జీఆర్టీ జ్యువెల్లర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెల్లర్స్ ఈ బంగారు లాకెట్లను తయారు చేసి సప్లై చేసే టెండర్లను దక్కించుకున్నాయి.