భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack)కి ప్రతీకారంగా భారత ఆర్మీ (Indian Army) ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరిట ప్రతిదాడికి దిగిన సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్థాన్లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా విడుదలయ్యాయి..
భారత ఆర్మీ దాడుల్లో బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా భారత బలగాలు జరిపిన ఈ దాడిలో భారీగానే ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘ఆపరేషన్ సింధూర్’కు ప్రతిచర్యగా దాయాది పాకిస్థాన్ దాడులు చేసే అవకాశం ఉండటంతో భారత్ అప్రమత్తమైంది.
సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించింది. అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేశారు. అలాగే రాజస్థాన్లోని పాక్ సరిహద్దును సీజ్ చేశారు. సరిహద్దుల వెంట ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. రాజస్థాన్లో పాక్ సమీపంగా ఉన్న నాలుగు విమానాశ్రయాలను కూడా మూసివేశారు. సరిహద్దుల వెంట యుద్ధ విమానాలతో గస్తీ ఏర్పాటు చేశారు.