భారత్ సమాచార్, ప్రత్యేకం ;
ఒక ఊరిలో చెట్టుకు ఓ గాడిద కట్టేయబడి ఉంది… దాని యజమాని దాన్ని అలా ప్రతి రోజూ కట్టేస్తూ ఉంటాడు. ఓ రాత్రి ఆ చెట్టుపై ఉండే దెయ్యం ఆ కట్లను తెంచేసింది. ఇక ఆ గాడిద గట్టిగా ఒళ్లు విరుచుకుని, మరింత గట్టిగా ఓండ్రపెట్టి లోకంపై పడింది. ముందుగా ఆ పక్కనే ఉన్న పొలాల్లో అడుగుపెట్టి, ఆ చేను అంతా తొక్కి, ధ్వంసం చేసేసింది. దీంతో చిర్రెత్తిన ఆ రైతు భార్య గాడిదను ఓ గొడ్డలితో నరికేసింది. ఇది చూసి కోపం ఆపుకోలేక సదరు గాడిద యజమాని ఆ రైతు భార్యను వేటకొడవలితో చంపేశాడు. ఆమె భర్త ఊరుకుంటాడా…? ఓ గునపం తీసుకొచ్చి ఆ గాడిద యజమాని గుండెల్లో గట్టిగా పోటు దింపాడు. వాడు వెంటనే చచ్చూరుకున్నాడు. గాడిద యజమాని భార్య ఆగ్రహం పట్టలేక, కొంగు నడుంకు బిగించి కొడుకులను కేకేసింది. వాళ్లంతా కలిసి ఆ రైతు ఇంటికి నిప్పు అంటించారు. తన ఇంటిని మంటల్లో చూసి, ఆ బూడిదతో కళ్లు మండిపోయిన రైతు ఆ గాడిద యజమాని భార్యను, కొడుకులను వెంటాడి వెంటాడి చంపేశాడు. తర్వాత కాసేపటికి ఆవేశం తగ్గి, ఆ చెట్టుపై ఉన్న దెయ్యాన్ని అడుగుతాడు… ‘‘ఎందుకు ఇంతమంది చావుకు కారణమయ్యావు..?’’ దెయ్యం ఏమన్నదంటే..? ‘‘నన్ను అనవసరంగా నిందించకు… నేను ఒక్కరినైనా చంపానా..? చెట్టుకు కట్టేసి ఉన్న ఓ గాడిదను జాలితో విడిపించాను… అంతే… మీరే మీలో ఉన్న అసలు దెయ్యాలను స్వయంగా బయటికి తీసి, ఒకరికొకరు చంపుకున్నారు…’’ మీడియా, సోషల్ మీడియా కూడా అంతే… రోజుకో గాడిద కట్లు తెంపేసి, సమాజం మీదకు వదిలేస్తయ్… మనం వాదాలు, ద్వేషాలతో తన్నుకుంటూ, పాత స్నేహాల్ని కూడా చంపేసుకుంటూ ఉంటాం… కొత్త శత్రువుల్ని ఆహ్వానిస్తుంటాం, జాగ్రత్త… అందుకనే అంటారు నిజం చెప్పులేసుకునే లోగ, అబద్దం ఊరంతా తిరిగి వస్తుందని. (మీడియా, సోషల్ మీడియా మొత్తం దుర్వినియోగం అవుతుందని కాదు, ప్రస్తుత సమాజంలో మెజార్టీ మీడియా పాత్ర దుర్వినియోగం అవుతుందని )
(వాట్సాఫ్ యూనివర్శిటీ నుంచి సేకరణ)