భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వరస్వామివారి (Sri Venkateshwara Swamy) ఆలయంలో ఈనెల (ఏప్రిల్) 6న శ్రీరామనవమి (Sri Rama Navami) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది టీటీడీ. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనుంది టీటీడీ. ఇక సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరగనుంది. ఆ తర్వాత 9గంటల నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనుంది.
సీతారాముల కల్యాణం.. పట్టాభిషేకం
ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టీటీడీ పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. ఇక ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
అలాగే ఏప్రిల్ 9న సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. ఇక ఏప్రిల్ 10 నుంచి 12 తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. శ్రీ కోదండరాముని తెప్పోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరించనున్నారు.