భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ రాష్ట్ర గీతంపై వివాదం రోజురోజుకు తీవ్రం అవుతుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఆంధ్ర పెత్తనం ఏంటనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని అందెశ్రీతో సంగీత దర్శకుడు కీరవాణిని ఎంపిక చేయడంపై తెలంగాణ ఉద్యమకారుల నుంచి, కళాకారుల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి ఉమ్మడి పాలనలో చితికిపోయి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి వీరోచిత పోరాటాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్ర గీతాన్ని ఇక్కడి మట్టిబిడ్డలే పాడాలని భావిస్తున్నారు. కీరవాణిపై మాకు ఎలాంటి భేషజాలు లేవు. ఆయన గొప్ప సంగీత దర్శకుడు. అందెశ్రీ కూడా గొప్ప కవి. కానీ ఇక్కడి పాట ఇక్కడి వారిని కించపరిచేలా అందెశ్రీ మాట్లాడడం బాధాకరం అని, తెలంగాణ కళాకారుల మీద, తెలంగాణ ప్రజల మీద గౌరవం లేని వ్యక్తి రాసిన పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఏ విధంగా చూడాలనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుందని, కళాకారుల ఆత్మఘోషిస్తుందన్నారు. రాష్ట్ర గీతంలోపాలుపంచుకునే అర్హత మాకు లేదా అని ఇక్కడి సంగీత దర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కళాతోరణంపై, చార్మినార్పై రేవంత్రెడ్డికి ఎందుకంత కోపం:
తెలంగాణ రాష్ట్ర గీతంపై మరొవైపు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాకతీయ కళాతోరణంపై, చార్మినార్పైన సీఎం రేవంత్కు ఎందుకంత కోపమని, జయజయహే తెలంగాణ గీతాన్ని కంపోజ్ చేయడానికి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరూ లేరా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల చుట్టూ వివాదం చెలరేగుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడంతో పాటు తెలంగాణ గీతానికి కీరవాణితో మ్యూజిక్ కంపోజ్ చేయించడమే దీనికి ప్రధాన కారణం. రాజకీయ దురుద్దేశ్యంతో తెలంగాణ గుర్తులను మార్చుతున్నారని ఓ పక్క ప్రతిపక్షాలు మండిపడుతుంటే.. త్యాగాలు, పోరాటాలకు చిహ్నంగా రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పేర్కొన్నారు.
తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు లేరా..?
రాష్ట్రప్రభుత్వం ప్రముఖ తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేయించి గీతానికి సంగీతాన్ని కంపోజ్ చేయిస్తుంది. ఈ బాధ్యతల్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణికి అప్పగించారు. తెలంగాణ గీతాన్ని మళ్లీ కంపోజ్ చేయడం దేనికనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాక కీరవాణి స్వరాలు సమకూర్చడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జయజయహే తెలంగాణ గీతాన్ని కంపోజ్ చేయడానికి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరూ లేరా..? అంటూ తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన్ అభ్యంతరం తెలిపింది. దీనిపై డైరెక్టర్ ప్రేమ్రాజ్ గీత రచయిత అందెశ్రీకి ఫోన్ చేసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన విషయం విదితమే.
కీరవాణి పెత్తనం ఏంటి: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్:
తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడంపై బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు. అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచాక గీత స్వర కల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చిందని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని వరంగల్ జిల్లా ప్రజలు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. చార్మినార్ను తొలగించడాన్ని ఎంఐఎం తీవ్రంగా తప్పుబడుతోంది.
అంతా అందెశ్రీ ఇష్టం: రేవంత్ రెడ్డి:
తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గీతం రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి ఇచ్చానన్నారు. అందెశ్రీ ఎవరిని ఎంచుకుని గేయానికి సంగీత రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని సీఎం స్పష్టంచేశారు. ఏ సంగీత దర్శకుడితో గేయం రూపకల్పన చేయాలనేది తన పని కాదన్నారు. గేయ రూపకల్పన బాధ్యత అంతా అందెశ్రీదేనని, కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం. మరోవైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఎంపిక తుది దశకు చేరుకుంది. ఇప్పటికే చిత్రకారుడు రుద్ర రాజేశం గీసిన పలు నమూనాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక నమూనాను ఎంపిక చేశారు. ఈ నమూనా తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుందని సమాచారం. మొత్తానికి జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున తెలంగాణ గీతం, రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణతో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందనే ఉత్కంఠ నెలకుంది.
మరిన్ని కథనాలు: