భారత్ సమాచార్.నెట్: నవజాత శిశువుల అక్రమ రవాణా (child trafficking) వ్యవహారాలపై ఉత్తర్ప్రదేశ్ (Uttarpradesh) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం (Serious) వ్యక్తం చేసింది. దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా చిన్నారుల అక్రమ రవాణా జరగినట్లు నిరూపితమైతే.. వెంటనే ఆ ఆసుపత్రి లైసెన్స్ను రద్దు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఓ ఆసుపత్రిలో ఒక నవజాత శిశువు చోరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన శిశువు తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆ చిన్నారిని ఓవ్యక్తి అక్రమంగా విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశే మిగిలింది. కేసుపై విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చిన్నారుల అక్రమ రవాణా కేసులపై యూపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం.. నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం పట్ల సీరియస్ అయ్యింది. ఈ కేసులో నిందితుడికి మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేసింది సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న చిన్నారుల అక్రమ రవాణా కేసులపై హైకోర్టులు ఎలా విచారణ జరుపుతున్నాయో తెలియజేయాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల లోపు పూర్తిచేయాలని, రోజూవారీ విచారణను కూడా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.