భారత్ సమాచార్.నెట్: ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) వివరాలను మీడియాకు తెలిపిన భారత్ సైనికాధికారి కల్నల్ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi) పై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (Vijay Shah) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) విచారించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం మంత్రి విజయ్ షాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి క్షమాపణలు చెప్పిన తీరుపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ క్షమాపణలను అంగీకరించలేమని పేర్కొంది.
మీరు ఎలాంటి క్షమాపణ చెప్పారు..? అంటూ ప్రశ్నించింది. సారీ చెబుతున్నప్పుడు అందులో కొంత అర్థం ఉండాలి. కొన్నిసార్లు న్యాయ విచారణ నుంచి బయటపడేందుకు కొందరు మర్యాదపూర్వకమైన భాషను ఉపయోగిస్తున్నట్లు నటిస్తారు.. మరికొన్నిసార్లు వారు మొసలి కన్నీరు కారుస్తారు. ఇందులో మీ క్షమాపణ ఎలాంటిది..? అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు రేపు రాత్రి 10 గంటల్లోగా ఆ బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం స్పష్టం చేసింది. అయితే ముగ్గురు సభ్యుల బృందంలో ఓ మహిళా ఎస్పీ ర్యాంక్ అధికారి కూడా ఉండాలని కోర్టు పేర్కొంది.
మే 28వ తేదీలోగా ఫస్ట్ స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ కేసులో మంత్రిని అరెస్టు చేయరాదని అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. అలాగే దర్యాప్తులో పిటిషనర్ పూర్తిగా సహకరించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషిని ఉద్దేశిస్తూ గత వారం మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు హిందూ సోదరుల్ని చంపేశారని, అందుకే ఆ వర్గానికి చెందిన వారి సోదరినే వారికి గుణపాఠం చెప్పందకు పంపినట్లు పేర్కొన్నారు.