భారత్ సమాచార్, చిలకలూరిపేట ; ప్రజాగళం పేరుతో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నేడు చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దాదాపుగా 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
నరేంద్ర మోడీ కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక 5 కోట్ల ప్రజలల్లో ఆశ కల్పించింది.2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా పొత్తు మొదలైంది. 2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా మళ్లీ పొత్తు పురుడు పోసుకుంది. అభివృద్ధి లేక ఏపీ అప్పులతో నలుగుతోంది. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం.
-పవన్ కల్యాణ్
ఎలక్ట్రిక్ పోల్స్ మీద ఉన్న జనాన్ని దిగిపోవాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. పవన్ మాట్లాడుతుంటే.. మైక్ అందుకుని సభికులను రిక్వెస్ట్ చేశారు. మీ ప్రాణాలు ఎంతో విలువైనవి, కిందికి దిగాలని మోడీ అభ్యర్థించారు.
ప్రజాగళం సభలో చంద్రబాబు…
నేను నరేంద్ర మోడీ సమక్షంలో చెబుతున్నాను. గత ఐదేళ్ళలో అసమర్థ, అవినీతి ప్రభుత్వం మూలంగా ఏపీ ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. కలెక్టర్ కార్యాలయాలు, రైతు బజార్ భవనాలు, ప్రభుత్వ కాలేజీ భవనాలు తాకట్టు పెట్టబడ్డాయి. మద్యం ఆదాయాన్ని పెంచుకుంటూ పోవడం రాష్ట్ర దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
ఎన్నికల్లో గెలవటానికి కూటమికి మోడీ అండ ఉంది. మోడీ క్రమశిక్షణను చూసి ప్రజలంతా చాలా నేర్చుకోవాలి. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి మోడీ చేస్తున్నారు.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పని చేస్తున్నారు..ప్రపంచంలో భారత్ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారు.
-చంద్రబాబు
కూటమి సభలో ప్రధాని మోడీ…
ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
నిన్ననే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. నాకు ఇక్కడ కోటప్పకొండ దగ్గర త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తోంది.. జూన్ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలం మరింత పెరిగింది. చంద్రబాబు, పవన్ ఏపీ కోసం చాలా కష్టపడుతున్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయి.. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.
ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోంది.. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించింది. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరికి ఎయిమ్స్ కేటాయించాం. ఎన్డీయేలో మేము అందరినీ కలుపుకొని వెళ్తాం.. ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో పార్టీలు గొడవ పడుతుంటే, తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట రోజున తెలుగు ప్రజలు ఎంతో ఆనందించారు.. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి పాత్రలతో మెప్పించారు.. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారు.
-ప్రధాని మోడీ.