భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాజ్భవన్ (Raj Bhavan)లో దొంగలు (Theives) పడ్డారు. భారీ భద్రత ఉండే రాజ్భవన్లో చోరీ ఘటన చోటుచేసుకోవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గవర్నర్ అధికారిక కార్యాలయం ఉండే ఇక్కడ చోరీ జరగడం సంచలనంగా మారింది. ఈ సంఘటన అటూ రాజకీయ వర్గాల్లోనూ, భద్రతా వ్యవస్థలలోనూ కలకలం రేపుతోంది. రాజ్భవన్ పరిధిలోని సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్లు చోరీకి గురైన ఘటన ఈ నెల 14న రాత్రి చోటు చేసుకుంది.
రాజ్భవన్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ రూమ్ నుంచి హార్డ్ డిస్క్లు మాయం చేసినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ రూంలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించిన వ్యక్తి హార్డ్ డిస్క్లను అపహరించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. చోరీకి గురైన వాటిలో రాజ్భవన్ సంబంధిత పరిపాలన వివరాలు, కీలక ఫైళ్ళు, సున్నితమైన సమాచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాజ్భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే హర్డ్వేర్ విభాగంలో గతంలో సబ్బందిగా పని చేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన అధికారులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుండి చోరీకి గురైన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా గతంలో నిందితుడి శ్రీనివాస్పై ఫొటోల మార్ఫింగ్కు సంబంధించి కేసు నమోదు కాగా ఆ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఇకపోతే నిత్యం హై సెక్యూరిటీ నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే రాజ్భవన్లో ఈ విధమైన చోరీ జరగడంపై అధికారిక వర్గాల్లో సంచలనంగా మారింది.