భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంభందించిన విధివిధానాలను ఏపీ ప్రభుత్వం తాజాగా ఖరారు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం కానున్నట్లు ప్రభత్వ వర్గాలు తెలిపాయి. ఈనెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. 31వ తేదీ నుంచి ఉచిత డెలివరీ ని ప్రారంభిస్తారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ డెలివరీ అయ్యేటట్టుగా కసరత్తులు చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ ధర రూ.876
ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లను లబ్దిదారులకు ఉచితంగా అందించనున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.876 కాగా.. సిలిండర్ ధరను లబ్ధిదారులు డెలివరీ సమయంలో చెల్లిస్తే.. వాటిని 48 గంటల్లోగానే డబ్బులు తిరిగి వారి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది.
మొదటి సిలిండర్ మార్చి 31 లోపు
ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు. ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. అన్ని అర్హతలూ ఉండి ఉచిత సిలిండర్ రాకపోతే.. టోల్ ఫ్రీ నెంబర్-1967 ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇక ప్రస్తుతం ఏపీలో కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు… 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అర్హులందరికీ సిలిండర్ అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
గ్యాస్ డెలివరీ చేయడానికి రూ.894.92కోట్లు
ఇక గ్యాస్ డెలివరీ చేయడానికి రూ.894.92కోట్ల రుపాయల నగదును అక్టోబర్ 29వ తేదీన అడ్వాన్సుగా ఆయిల్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం చెల్లించనుంది. ఈ పథకానికి ఏడాదికి రూ.2,684 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే ఐదేళ్లలో మొత్తం రూ.13,423 కోట్లు అవుతుందని చెబుతున్నారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగు నెలలకు ఓ సిలిండర్ చొప్పున ఉచితంగా అందిస్తారు.