భారత్ సమాచార్, ముంబయి ;
దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో తెలిపేందుకు మరో ఉదాహరణ మన ముందు నిలిచింది. ముంబయిలోని కలినా ప్రాంతంలో ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిన వాక్-ఇన్-ఇంటర్వ్యూలకు భారీగా నిరుద్యోగులు తరలిరావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. వారిని నియంత్రించలేక అధికారులు, పోలీసులు నానా అవస్తలు పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2,216 హ్యండీమాన్ ఖాళీలను భర్తీ చేసేందుకు ముంబయి ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించింది. కౌంటర్ల వద్ద తమ పత్రాలు సమర్పించేందుకు భారీగా వచ్చిన అభ్యర్థులు ఒకరినొకరు తోసుకోవడం కనిపించింది. ఆహారం, నీరు అందక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరు స్వల్ప అస్వస్థతకు కూడా గురయ్యారు. ఆ ఉద్యోగంలో చేరినవారు విమానం నుంచి లగేజీ దించడం, ఎక్కించడంతోపాటు బ్యాగేజీ బెల్టులను చూసుకోవాలి. ఒక్కో ఎయిర్క్రాఫ్ట్లో లగేజీ, కార్గోను చూసుకునేందుకు ఐదుగురు లోడర్స్ అవసరం ఉంటుంది. వారికి నెలకు రూ.20 వేల నుంచి 25 వేలకు వేతనం అందిస్తారు. ఓవర్టైమ్ చేసి చాలామంది రూ.30 వేల వరకు సంపాదిస్తుంటారు. ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హతలు ఉంటే సరిపోతుంది కానీ, అభ్యర్థులు శారీరకంగా ధృఢంగా ఉండటం తప్పనిసరి. అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కొందరు 400 కి.మీ. ప్రయాణించి రావడం గమనార్హం. వారిలో పోస్టు గ్రాడ్యుయేషన్, డిగ్రీ పూర్తి చేసినవారు కూడా ఉన్నారు. ఉన్నత చదువులు చదివినా ఇప్పటివరకు ఉద్యోగం లభించని వారూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు. మరికొందరు రాజస్థాన్ నుంచి వచ్చిన వారున్నారు.