భారత్ సమాచార్.నెట్, తిరుపతి: తిరుపతి (Tirupati) రైల్వే స్టేషన్ (Railway station)ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించేందుకు ప్రణాళికలు ముమ్మరంగా సాగుతున్నాయి. వికసిత్ భారత్ (Vikasat bharath) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు.. పూర్తి అవుతే.. దాదాపు లక్షన్నర మంది ప్రయాణికులు ప్రతిరోజూ మరింత సులభంగా, సౌకర్యంగా రాకపోకలు సాగించవచ్చు.
2022 జూన్లో రూ.300 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్కు దక్షిణ దిశలో ప్రవేశ ద్వారం, భవన నిర్మాణం ప్రారంభం కాగా.. ఉత్తరం వైపు మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దక్షిణ వైపున ఉన్న నూతన భవన నిర్మాణ పనులు సుమారు 70 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ భవనాన్ని వచ్చే మే లేదా జూన్ నాటికి అందుబాటులోకి తెచే అవకాశం ఉంది. అలాగే దక్షిణ వైపున నిర్మిస్తున్న ఈ భవనం జీ+3 అంతస్తుల కాగా.. దాదాపు 9,261 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 200 కార్లు, 500 ద్విచక్ర వాహనాల పార్కింగ్కు బేస్మెంట్ను ఏర్పాటు చేస్తున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్లో టికెట్ కౌంటర్లు, వెయిటింగ్ లాంజ్ ఏర్పాటు చేస్తున్నారు. రెండో అంతస్తులో ఓపెన్ ఏరియాలో కామన్ వెయిటింగ్ హాల్, మహిళల కోసం ప్రత్యేకంగా వెయిటింగ్ ఏరియా, ఫుడ్కోర్టులు, మరుగుదొడ్లు, క్లాక్రూమ్లు ఏర్పాటు చేయనున్నారు. మూడో అంతస్తులో రన్నింగ్ రూమ్, టీటీఐ విశ్రాంతి గదులు, స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరం వైపు కూడా ఇదే తరహా ఆధునిక సౌకర్యాలను కల్పించనున్నారు.
ఇకపోతే రైల్వే స్టేషన్లో దక్షిణం, ఉత్తరం వైపు భవనాలను అనుసంధానిస్తూ.. విమానాశ్రయం తరలహాలో ఏర్పాటు చేసిన కాన్కోర్స్ ఆకర్షణీయంగా నిలవనుంది. ఈ కాన్కోర్స్ కింద ఆరు ప్లాట్ఫాంలు ఉండగా, పైభాగం నుండి ప్రతి ప్లాట్ఫారానికి ఎస్కలేటర్లు, లిఫ్టులు, మెట్లు ఏర్పాటు చేశారు. సంబంధిత రైలు స్టేషన్లోకి వచ్చేవరకు ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కాన్కోర్స్పై లభ్యమవుతాయి. ఈ తరహా సౌకర్యాలు ఉత్తర దిశలో కూడా కల్పించనున్నారు.