భారత్ సమాచార్.నెట్: భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇప్పటికే పలుమార్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే పాత పాటను పాడారు. నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడా మీడియాతో మాట్లాడారు. ఇరాన్-ఇజ్రాయెల్, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు సహా ప్రపంచంలో చోటుచేసుకున్న అనేక యుద్ధ స్థితులను తానే అడ్డుకున్నాని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలన్నీ తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకున్న ట్రంప్.. తాను జోక్యం చేసుకోవడంతోనే భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాధినేతలకు వరుస ఫోన్ కాల్స్ చేయడంతోనే యుద్ధం ముగించారని చెప్పారు. మీరు ఒకరితో ఒకరు పోరాడితే అమెరికా ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోదని హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు. ఇదే కారణంగా ఇరు దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాయని.. తాను అణు యుద్ధాన్ని అడ్డుకున్నానని ట్రంప్ తెలిపారు.
ట్రంప్ కామెంట్స్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ట్రంప్ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మే 10 నుంచి ఇలా చెప్పడం ఇది 16వ సారి అని రమేశ్ పేర్కొన్నారు. అలాగే హస్తం పార్టీ నేత పవన్ ఖేరా కూడా ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి ప్రధాని భారత్ ప్రయోజనాలను తుంగలో తొక్కారని కామెంట్స్ చేశారు. భారత్- పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది.