భారత్ సమాచార్.నెట్, అమెరికా: దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams).. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఇటీవల పుడమిని చేరుకున్న సంగతి తెలిసిందే. కేవలం 8 రోజుల పర్యటన నిమిత్తం ఐఎస్ఐఎస్కు వెల్లిన వీరు.. అనుకోకుండా వారు వచ్చిన వ్యోమనౌకలో సాంకేతిక లోపం కారణంగా 9 నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ ఉన్నట్లయితే అదనపు జీతం ఉంటుందని వార్తలు రావడంతో వీరికి ఎలాంటి వేతనాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
ట్రంప్ ప్రకటన..
అయితే తాజాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. వాళ్లకు ఓవర్టైమ్ జీతాన్ని సొంతంగా చెల్లిస్తానని ప్రకటించారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్కు అదనపు వేతనం ఉంటుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా స్పందించారు. ” నేను చేయాల్సివస్తే నా జేబు నుంచి వాళ్లకి ఓవర్టైమ్ శాలరీ ఇస్తాను” అని తెలిపారు. ఆస్ట్రోనాట్స్ను సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చేందుకు సాయం చేసిన ఎలాన్ మస్క్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. ఆయన లేకపోతే ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించండి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అదనపు జీతం ఉండదు..
ఇకపోతే అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ ఉన్నట్లయితే అదనపు జీతం ఉండదు. ఫెడరల్ ఉద్యోగులు కావడం వల్ల అంతరిక్షంలో వాళ్లు పనిచేసినప్పటికీ కూడా భూమిపై సాధరణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారు. అయితే సాధారణంగా వచ్చే శాలరీతో పాటు ఐఎస్ఎస్లో ఆహారం, బస ఖర్చులను మాత్రం నాసా భరిస్తుంది. కాగా జీతం పరంగా చూస్తే నాసా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతాన్నే పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ జీఎస్-13 నుంచి జీఎస్-15 కింద చెల్లింపులు చేస్తారని మాజీ వ్యోమగామి తెలిపారు. ముఖ్యంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అత్యధిక గ్రేడ్ జీఎస్-15 గ్రేడ్ పే జీతం అందుకుంటున్నారని వెల్లడించారు. అంటే వీరిద్దరికీ ఏడాదికి లక్షా 24 వేల 133 డాలర్ల నుంచి లక్షా 62 వేల 372 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్లు) వరకు ఉంటుందని పేర్కొన్నారు.