భారత్ సమాచార్.నెట్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ (Twitter) (ప్రస్తుతం ఎక్స్)ను ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) అధీనంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా దాని పేరును ట్విట్టర్ నుంచి ఎక్స్ (X)గా మార్చిన ఎలాన్ మస్క్.. బ్లూ బర్డ్ లోగోను సైతం తొలగించి ఎక్స్గా మార్చారు. అయితే తాజాగా ట్విట్టర్ బ్రాండ్ గుర్తింపుగా ఉన్న పాత లోగో బ్లూ పిట్టను వేలం వేయగా.. రికార్డు ధర పలికింది.
ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ ఐకానిక్ బ్లూబర్డ్ లోగోను వేలం వేసింది. ఒకప్పుడు శాన్ఫ్రాన్సిస్కోలోని హెడ్ క్వార్టర్ వద్ద ఉన్న ఈ బ్లూ బర్డ్ లోగో వేలంలో భారీ ధర పలికిందని ఆర్ఆర్ ఆక్షన్ సంస్థ ప్రకటించింది. 12 అడుగులు పొడవు, 9 అడుగుల వెడల్పు.. 254 కిలోల బరువున్న ఈ లోగో 35వేల డాలర్లకు ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్లు వివరించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని విలువు దాదాపు రూ.30 లక్షలు అన్నమాట. కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
2022లో మస్క్ చేతిలోకి ఎక్స్..
ఇదిలా ఉంటే ఈ లోగోను వేలానికి పెట్టింది ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. కాగా 2022 అక్టోబర్లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ను కొనుగోలు చేశారు. అందుకోసం ఆయన ఒక్కో స్టాక్కు 54.20 డాలర్లు చొప్పున చెల్లించారు. ఇలా మొత్తంగా 44 బిలియన్ డాలర్లు చెల్లించి మరీ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ను సొంతం చేసుకున్నారు. ఆపై 75 శాతం మంది ఉద్యోగులను తొలగించి.. ట్విట్టర్ పేరును ఎక్స్గా మార్చి.. లోగోను కూడా మార్చేశారు. కాగా 2006లో ఏర్పాటు అయిన ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగోను.. పక్షుల కిలకిలరావాలకు గుర్తుగా డిజైన్ చేశారు. వెబ్ సైట్ క్రియేటివ్ బ్లాగ్ కథనం ప్రకారం లైట్ బ్లూ బర్డ్ సింబల్ కోసం అప్పట్లో 15 డాలర్లు చెల్లించి లోగో తయారు చేయించారు.