భారత్ సమాచార్.నెట్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) ఆయన భార్య ఉషా వాన్స్ (Usha Vance) భారత పర్యటన ఖరారైంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వారు భారత్ (India)ను సందర్శించనున్నట్లు అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి 24 వరకు ఇటలీ, భారత్లో పర్యటించనున్నట్లు తెలిపారు. పర్యటనల్లో భాగంగా ఆయా దేశాల నేతలతో వాణిజ్య, భౌగోళిక అంశాలపై జేడీ వాన్స్ చర్చలు జరుపుతారని అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.
భారత పర్యటనలో భాగంగా వాన్స్ కుటుంబం ఢిల్లీ, జైపుర్, ఆగ్రాలను సందర్శించనుంది. ఆయా చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననుంది. అదేవిధంగా ప్రధాని మోదితో కూడా జేడీ వాన్స్ భేటీ కానున్నారు. పలు దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్ వార్ వ్యవహారం ప్రపంచదేశాల్లో హాట్ టాపిక్గా ఉన్న వేళ జేడీ వాన్స్ భారత్కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్కు రావడం ఇదే తొలిసారి.
ఇకపోతే అమెరికా సెకండ లేడి ఉష వాన్స్ తొలిసారి భారత్ పర్యటనకు వస్తున్నారు. జేడీ వాన్స్ భార్య ఉష భారత సంతతికి చెందిన వారు. ఉష తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరి 1970 చివరలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఆమె అక్కడే జన్మించారు. కాగా, ఉషా, జేడీ వాన్స్ లా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒకరికొకరు పరిచమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు