భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే ఈ నెల 24, 29 తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని కూడా టీటీడీ స్పష్టం చేసింది.
ఇకపోతే మార్చి 25న మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయి. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. కాగా ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేస్తారు.
సిఫార్సు లేఖలపై ప్రకటన..
మార్చి 24 నుండి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమలలో శ్రీవారి దర్శనం అమలులోకి రానున్న నేపధ్యంలో.. ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. మార్చి 25 మరియు మార్చి 30వ తారీఖుల్లో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు.. శ్రీవారి దర్శనం మార్చి 24వ తారీఖు నుండి అమలులోకి రానుంది. ఇందులో భాగంగా 23న (నేడు) సిఫార్సు లేఖలను అధికారులు స్వీకరించి 24న దర్శనానికి అనుమతిస్తారు. ఇకపోతే ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు శనివారం స్వీకరించి.. ఆదివారం దర్శనం కల్పించనున్నట్లు ఇదివరకే టీటీడీ ప్రకటించింది.