భారత్ సమాచార్, జాతీయం ;
మీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉందా? అయితే మీకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నట్లే..! దేశంలో దాదాపుగా ప్రతి కుటుంబానికి ఎల్పీజీ కనెక్షన్ ఉంటుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఎమిటంటే ఎల్పీజీ సిలిండర్ను బుక్ చేసుకున్న తర్వాత కస్టమర్లు వారి కుటుంబానికి రూ.50 లక్షల కాంప్లిమెంటరీ ప్రమాద బీమాను స్వయంచాలకంగా అందుకుంటారు. ఈ ప్రమాదబీమా కోసం వినియోగదారులు ఎలాంటి ఎక్స్ట్రా చార్జీలను చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎల్పీజీ సిలిండర్లోని గ్యాస్ వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే అనుకోని సందర్భంలో సిలిండర్ వల్ల ప్రమాదం జరిగితే మాత్రమే వినియోగదారులు ప్రమాద బీమాను అప్లయ్ చేసు కోవడానికి అర్హులవుతారు. బాధిత కుటుంబాలకు పెట్రోలియం కంపెనీల నుండి రూ.50 లక్షల క్లెయిమ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ వెబ్సైట్ మై ఎల్పీజీ సైట్లోని సమాచారం ప్రకారం పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ కనెక్షన్ తీసుకున్న తర్వాత కస్టమర్లకు,వారి కుటుంబాలకు ప్రమాద రక్షణను అందిస్తాయి. గ్యాస్ లీకేజీలు లేదా పేలుళ్లు వంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ రూ.50 లక్షల బీమా కవరేజీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పెట్రోలియం, ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య భాగస్వామ్యం క్లెయిమ్ చేసిన మొత్తాన్ని పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తుంది. మొత్తం కుటుంబానికి ఒక్కో సభ్యునికి రూ.10 లక్షలు, గరిష్ట పరిమితి రూ.50 లక్షలు.ఆస్తి నష్టం కోసం రూ. 2 లక్షల వరకు క్లెయిమ్ వర్తిస్తుంది. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే రూ. 6 లక్షల వ్యక్తిగత ప్రమాద కవరేజీ అందిస్తుంది. వైద్య చికిత్స కోసం గరిష్టంగా రూ. 30 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది.
ఒక్కో సభ్యునికి రూ.2 లక్షలకు పరిమితం చేయబడింది.
క్లెయిమ్ చేయడం ఇలా…
ప్రమాదం జరిగితే మొదటగా ఆ వివరాలతో సమీపంలోని పోలీస్ స్టేషన్తో పాటు మీ గ్యాస్ కంపెనీకు సమాచారం అందించాలి. ఆ ప్రాంతానికి అనుబంధంగా ఉన్న బీమా కంపెనీ సమగ్ర విచారణ జరుపుతుంది. సిలిండర్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్ధారించిన తర్వాత బీమా కంపెనీకి నోటిఫికేషన్ వస్తుంది. విచారణ నివేదిక తర్వాత క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. క్లెయిమ్కు మద్దతు ఇవ్వడానికి,పోలీసు ఫిర్యాదు,చికిత్స ఖర్చులు, బిల్లులు,దురదృష్టవశాత్తు మరణం సంభవించి నప్పుడు,పోస్ట్మార్టం లేదా మరణ ధ్రువీకరణ పత్రం వివరాలను భద్రం చేసుకోవాల్సి ఉంటుంది.