భారత్ సమాచార్, విశాఖపట్నం : ‘నిర్భయ’ ఘటనలో ఉరిశిక్షలు పడినా.. కొందరు దుర్మార్గులు తమ కామ పైశాచికాన్ని వదలిపెట్టడం లేదు. ఆడపిల్లల రక్షణకు దేశంలో చోటు లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిర్భయ ఘటన కంటే దారుణమైన, సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది.
తాజాగా విశాఖ పట్టణంలో ఒక దళిత బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాల చేతిలో ఆ బాలిక నరకాన్ని అనుభవించింది. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన 17ఏండ్ల బాలికను వంచించి ప్రేమ పేరుతో ప్రియుడు తొలుత కామవాంఛ తీర్చుకున్నాడు. తర్వాత తన మిత్రుడిని కూడా ఉసిగొలిపాడు. తర్వాత మరో 8మంది కూడా బాలికను రెండు రోజుల పాటు లాడ్జిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో నివాసం ఉంటోంది. ఈ ఇంట్లోని బాలిక రైల్వే న్యూకాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరింది. బాలికకు భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఈనెల 18న ఆమెను ప్రియుడు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితుడినీ కూడా రప్పిస్తే అతడు కూడా ఆఘాత్యానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్ కు వెళ్లి రోదిస్తుండగా.. అక్కడ పర్యాటకులను ఫొటోలు తీసే ఓ వ్యక్తి ఆమెను జగదాంబ కూడలి సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించాడు.. అతడితో సహా స్నేహితులు ఎనిమిది మంది రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటి నుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే మిస్సింగ్ కేసు నమోదు చేసిన నాలుగో పట్టణ పోలీసులు 22న ఆమెను గుర్తించి కంచరపాలెంలోని ఇంటికి చేర్చారు. తనపై జరిగిన ఆఘాయిత్యాలతో బిక్కుబిక్కుమంటున్నా..ఆదివారం వరకు బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులతోనూ చెప్పలేకపోయింది. తాను పడ్డ బాధలను ఆదివారం చెప్పడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 8మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి జార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు.