భారత్ సమాచార్.నెట్, మహారాష్ట్ర: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde)పై స్టాండర్ కమెడియన్ కునాల్ కమ్రా (Kunal Kamra) చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇంకా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ అని చేసిన వ్యాఖ్యలు శివసేన (Shiva Sena) కార్యకర్తల్లో ఆగ్రహం రేపింది. దీంతో కునాల్ కమ్రా నిర్వహించిన క్లబ్పై కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం ఆయనపై కేసులు నమోదు చేశారు. తాజాగా ఆయనపై మహారాష్ట్ర(Maharastra)లో మూడు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కునాల్ కమ్రా.. తమ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. కానీ హాజరుకాలేదు. అరెస్ట్ చేయాలంటూ ముంబై పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న ఇప్పటివరకు సాధ్యం కాలేదు.
మరోవైపు అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ మద్రాస్ హైకోర్టు (Madras Highcourt)ను కునాల్ కమ్రా ఆశ్రయించారు. దీంతో ఆయనకు మధ్యంతర బెయిల్ (Interim Bail) మంజూరు చేసింది. ఇక కునాల్ కమ్రా వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. సుపారీ ఇచ్చి మాట్లాడించినట్లు ఉందని షిండే వ్యాఖ్యానించారు. శివసేన కార్యకర్తల దాడిని సమర్థించనని, కానీ న్యూటన్ సిద్ధాంతం ప్రకారం చర్యకు ప్రతి చర్య ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవిస్, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా కునాల్ కమ్రా వ్యాఖ్యలను ఖండించిం.. షిండేకు మద్దతుగా నిలిచారు.
దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతుండగా.. అనేక మంది కార్యక్రమం జరిగిన వేదికను సైతం కూల్చేశారు. కునాల్ కమ్రా వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కానీ కమ్రా మాత్రం.. తాను డిప్యూటీ సీఎంకు అస్సలే క్షమాపణలు చెప్పనని వివరించారు. షిండే గురించి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్న మాటలనే తాను చెప్పానని పేర్కొన్నారు. అలాగే దాడులు చేస్తున్న వారిని చూసి ఏమాత్రం జంకనని ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా ఏక్నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలు ఇంకా మరిచిపోకముందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను టార్గెట్ చేస్తూ ఓ పేరడీ పాటను విడుదల చేశాడు కునాల్ కమ్రా. “మిస్టర్ ఇండియా” సినిమాలోని “హవా హవాయి” పాటను పేరడీ చేస్తూ.. పన్ను చెల్లింపుదారుల సొమ్ము అంతా వృథా అవుతుందని ఆరోపించారు. .