భారత్. సమాచార్.నెట్: ట్రైన్ టికెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్లు రైల్వేశాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. నాన్ ఏసీ మెయిల్/ ఎక్స్ప్రెస్ రైళ్ల టికెట్ ధరలు కిలోమీటరుకు 1 పైసా, ఏసీ తరగతుల టికెట్లు కిలోమీటరుకు 2 పైసాల చొప్పున పెరగనున్నాయి. ఈ మేరకు రైల్వే వర్గాల సమాచారం ఆధారంగా పలు ఆంగ్ల మీడియా వెబ్సైట్లు ఈ వార్తను ప్రచురించాయి. దీనిపై రైల్వే శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
చాలా ఏళ్ల తర్వాత రైల్వే టికెట్ల రేట్లలో ఈ రకంగా స్వల్ప మార్పు జరగనుంది. సబర్బన్ రైళ్ల టికెట్ల ధరల్లో, అలాగే 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణాలపై ఈ పెంపు వర్తించదు. కానీ 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణం ఉన్న సెకండ్ క్లాస్ టికెట్లకు మాత్రం కిలోమీటరుకు 1 పైసా చొప్పున ధర పెరగనుంది. కాగా కొత్తగా పెరగనున్న టికెట్ ధరలు.. ప్యాసింజర్ల బడ్జెట్పై పెద్దగా ప్రభావం చూపబోదని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే వచ్చే నెల నుంచి రైల్వే శాఖ మరో కొత్త మార్పు తీసుకురానుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ అథెంటికేషన్ని తప్పనిసరి చేసింది. ఏజెంట్లు వీటిని దుర్వినియోగం చేయకుండా, తత్కాల్ స్కీమ్ బెనిఫిట్స్ సాధారణ ప్రజలు పొందేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు క్లారిటీ ఇచ్చారు. జులై 1 నుంచి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసిన ప్యాసింజర్లకే తత్కాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అధికారిక IRCTC వెబ్సైట్ లేదా యాప్ ద్వారానే టికెట్ బుకింగ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.