భారత్ సమాచార్.నెట్, కృష్ణా: గుడివాడ-ముదినేపల్లి జాతీయ రహదారిలోని మల్లాయపాలెం రైల్వేగేటును మరమ్మతు పనుల నిమిత్తం ఈ నెల 8 నుంచి 22 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గురువారం గేటు వద్ద బోర్డును ఏర్పాటు చేశారు. 15 రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోనున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయ మార్గాలపై పోలీసు, ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. గుడివాడ నుంచి దొండపాడు, మోటూరు మీదుగా ముదినేపల్లికి కార్లు, చిన్న వాహనాలను, గుడ్లవల్లేరు మీదుగా బస్సులు, ఇతర పెద్ద వాహనాలను మళ్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే, ఏ రూటులో రాకపోకలకు ఇబ్బంది ఉండదనే దానిపై ఇంకా ఆలోచిస్తున్నామని గుడివాడ రూరల్ సీఐ సోమేశ్వర రావు తెలిపారు. ఈ మార్పు వల్ల ప్రయాణికులకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు.
మరిన్ని కథనాలు