భారత్ సమాచార్ : మన చిన్నప్పటి కాలంలో లేదా ప్రస్తుతం అయినా కూడా ఒక పంట వేయాలంటే చాలా శ్రమ, ఎక్కువ సమయంతో కూడుకున్న పని అని మనకు బాగా తెలుసు. పంట వేయాలంటే ముందుగా భూమిని చదనుగా చేయాలి, దున్నాలి. నీళ్లు పెట్టాలి. ఆ తర్వాత విత్తనాన్ని అందులో నాటాలి. అది పెరిగేందుకు సరైన సమయంలో సరైన ఎరువులు వేయాలి. ఆతర్వాత అది ఏ నాలుగైదు నెలలకే పెరిగి ఫలసాయాన్ని కానీ, ధాన్యాన్ని కానీ అందిస్తుంది. అయితే కొందరు సైంటిస్టులకు ఈ ప్రాసెస్ బాగా ఆలస్యమవుతోందని భావించారు. పంట కాలాన్ని తగ్గించి, మొక్క వేగంగా పెరిగేలా ఓ కొత్త ఆవిష్కరణ పై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో ‘ఎలక్ట్రానిక్ మట్టి’ ఉంటుంది. ఇదేంటి మట్టి అంటున్నారు అనుకుంటున్నారా? అదెంటో చదవండి మరి…
‘హైడ్రోఫోనిక్స్’ – ఈ సాయిల్
భూమి లేదా మట్టి అవసరం లేకుండా చేసే వ్యవసాయ పద్ధతి ‘హైడ్రోఫోనిక్స్’ కోసం స్వీడన్ సైంటిస్టులు ‘ఎలక్ట్రానిక్ మట్టి’ని డెవలప్ చేశారు. ఈ తరహ మట్టిలో బార్లీ మొలకల వేర్లను విద్యుత్తుతో ఉద్దీపన చేయడం ద్వారా, మొలకలు 15 రోజుల్లో సగటున 50 కన్నా ఎక్కువ వృద్ధి చెందినట్టు ‘పీఎన్ఎస్’ జర్నల్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. హైడ్రోఫోనిక్స్ సాగుకు ఉపయోగపడే ‘ఎలక్ట్రానిక్ మట్టి’ని లింకోపింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలిని స్టావ్రిండో ఆధ్వర్యంలో సైంటిస్టుల బృందం తయారుచేసింది. దీనికి వారు ‘ఈ-సాయిల్’ అనే పేరు పెట్టారు.
కేవలం నీటి ఆధారంగా…
హైడ్రోఫోనిక్ ఫార్మింగ్.. ఇటీవల పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా మనం వింటున్న మాట. భూమి లేదా మట్టి అవసరం లేకుండా, మనం ఎంచుకున్న చోట కేవలం నీటి ఆధారంగా పంటలు సాగు చేయడాన్ని ‘హైడ్రోఫోనిక్ ఫార్మింగ్’ అని పిలుస్తారు. మొక్కల ఎదుగుదలకు నీరు, పోషకాలు అవసరమైనంత అందించేందుకు క్లోజ్డ్ సిస్టం ఏర్పాటు చేస్తారు. ఇది సమర్థంగా పనిచేసేందుకు ఎలక్ట్రానిక్ మట్టి(ఈ-సాయిల్)ని సైంటిస్టులు తయారు చేశారు.
ఈ- సాయిల్ ఉపయోగాలు..
- కూరగాయాలు, ఔషధ గుణాలుండే మొక్కల్ని పెంచేందుకు ఈ తరహా సాగు అనుకూలంగా ఉంటుంది.
- సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానాన్ని అనుసరించి పంటను పొందవచ్చు.
- అలాగే కలుపు సమస్య, చీడపీడల బాధలు ఉండవు.
- వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ విధానం ద్వారా పంటను తీయవచ్చు.
సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో ఆహార డిమాండ్ ను ఎదుర్కొలేం. ఈ విధానంలో పట్టణాల్లోనూ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా సమస్యను ఎదుర్కొవచ్చు.