భారత్ సమాచార్.నెట్, వరంగల్: గీసుగొండ మండలం ధర్మారంలోని టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న యువతిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రింకిమళ్లీ (21) అనే యువతి తన స్నేహితురాళ్లతో కలిసి టెక్స్టైల్ పార్కులో పనిచేస్తుంది. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో, రోజులాగే పని ముగించుకుని కంపెనీ వాహనంలో ధర్మారం బస్ స్టాప్ వద్ద దిగింది. స్నేహితురాళ్లు గేరిపేంద్ర, ప్రియాంక, ప్రియాలతో కలిసి పానీపూరి తిని నడుచుకుంటూ వెళ్తుండగా, వరంగల్ వైపు నుండచి నర్సంపేట వైపు వస్తున్న ఒక కారు ఆగింది. కారులో ఉన్న నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రింకిమళ్లీని బలవంతంగా అందులోకి ఎక్కించుకుని వెళ్లారు. తన స్నేహితురాళ్లు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసినవారు రింకిమళ్లీ భర్త, అతని కుటుంబ సభ్యులే అయి ఉంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
మరిన్ని కథనాలు