భారత్ సమాచార్.నెట్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఏసీబీ (ACB) అధికారులు మరోసారి నోటీసులు (Summons) జారీ చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేసు (Formula E Race Case)లో కేటీఆర్ను ఏసీబీ మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇదివరకు కూడా ఇదే కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఫార్ములా ఈ రేసు కేసులో మే 28న విచారణకు హాజరుకావాలని మే 26న కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. అయితే నెలాఖరులో అమెరికా, యూకే పర్యటన షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో పర్యటన అనంతరం విచారణఖు హాజరవుతానని కేటీఆర్ చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ సహా అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది.
మరోవైపు ఈ కేసును ఈడీ సైతం దర్యాప్తు చేస్తోంది.
అయితే జనవరి 9న కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అంతకు రెండు రోజుల ముందే విచారణ కోసం ఆయన హాజరయ్యే సమయంలో తన న్యాయవాదిని అనుమతించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత తనపై కేసును రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అనంతరం విచారణ సమయంలో తన న్యాయవాదిని కూడా అనుమతించాలని మరో పిటిషన్ దాఖలు చేయగా.. ఇందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఆయన జనవరి 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కాగా, ఫార్ములా ఈ రేసులో 55 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.