భారత్ సమాచార్, అమరావతి ;
పదో తరగతి పూర్తి అయిన తర్వాత తక్కువ సమయంలో ఉపాధి పొందటానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు చాలా బాగా ఉపయోగపడతాయి. రెండేళ్ల కాల వ్యవధి ఉన్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేయగలిగితే కేవలం 19 ఏళ్ల వయసులోనే కొలువులు దక్కడం ఖాయమని నిపుణులు అంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి 20వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
విద్యార్హతలు …
పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 15 నుంచి 22 సంవత్సరాల్లోపు వయసున్న వారికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.angrau.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. పూర్తి సమాచారానికి ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్సైట్ను పరిశీలించవచ్చు. జూన్ 1వ తేదీ నుంచి 20వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సీట్ల కేటాయింపు, ఫీజులు ఇలా…
అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం, బాలికలకు 33 శాతం, అంగ వైకల్యం కలిగిన వారికి 3 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశ అర్హత పొందిన వారు ఏడాదికి రూ.8,800 చెల్లించాలి. హాస్టల్లో వసతి పొందేందుకు రూ.11 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తి అయిన తర్వాత డిపాజిట్ సొమ్మును వెనక్కు చెల్లిస్తారు. ప్రైవేట్ కళాశాలల్లో ప్రభుత్వ నిర్దేశించిన మేరకు ఏడాదికి రూ.29 వేలు ఫీజు, హాస్టల్కు సంబంధించి నెలకు రూ.5,500 చెల్లించాల్సి ఉంటుంది.