భారత్ సమాచార్.నెట్: గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో ఈ నెల 12న ఘోర విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కలిచివేసింది. తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రాణాలో కోల్పోయారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (Gujarat Former Chief Minister), భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత (BJP Senior Leader) విజయ్ రూపాని (Vijay Rupani) మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.
అయితే ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆయన మృతదేహం లభించింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా విజయ్ రూపాని భౌతికకాయాన్ని నిర్ధారించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. విజయ్ రూపాని కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో.. ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహం డీఎన్ఏ సరిపోలిందని.. దీంతో అది రూపానీదేనని నిర్ధారించుకున్నామని సంఘ్వీ తెలిపారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు 14 మృతదేహాలను పరీక్షల ఆధారంగా గుర్తించి కుటుంబాలకు అప్పగించామని బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. మిగతా 8 మృతదేహాలను కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా గుర్తించడంతో పరీక్షల అవసరం లేకుండానే అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత వల్ల ఎక్కువమంది శరీరాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. అందువల్ల డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఒక్కో పరీక్షకు సమయం ఎక్కువగా పడుతుండటంతో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు.