భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 కు నోటిఫికేషన్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. జులై 2 వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్ నోటిఫికేషన్ ను ఆన్ లైన్ వేదికగా విడుదల చేశారు. ఆన్లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మరోవైపు, మెగా డీఎస్సీకి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్, సిలబస్తో పాటు ఆన్లైన్లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను ఖరారు చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. మెగా డీఎస్సీకి అర్హత అయిన టెట్ పరీక్షను మరోసారి నిర్వహించడం ద్వారా ఇంకా ఎవరైనా రాయాలనుకుంటే రాసే వీలును ప్రభుత్వం కల్పించింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ డిసెంబర్ 10లోగా మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది.