భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం (Spiritual Destination) తిరుమల (Tirumala) గగనతల భద్రతపై (Security) టీటీడీ (TTD) దృష్టి సారించింది. ఎక్కడ డ్రోన్ ఎగిరినా టెక్నాలజీతో తిప్పికొట్టేలా.. యాంటీ డ్రోన్ సిస్టమ్ (Anti Drone System)ను వినియోగించాలని టీటీడీ భావిస్తోంది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లు పనిచేయకుండా నిరోధించేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 68.14 శాతం నుంచి 80 శాతానికి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పాలకమండలి తెలిపారు. అటవీ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు టీటీడీ రూ.4 కోట్లు ఇచ్చేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే తిరుమలలోని 42 వీఐపీ అతిథి గృహాల ఆధ్యాత్మిక పేర్లు మార్చారు. రెండు అతిథి గృహాల పేర్లు మార్చలేదు వాటికి టీటీడీనే పేర్లు మార్చనుంది. ఆకాశగంగ, పాపవినాశం, కాలికనడక మార్గాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేశారు.
అలాగే ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, ఒంటిమిట్ట ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారీకి ప్రతిపాదనలు స్వీకరించాలని పాలకమండలి నిర్ణయించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులను బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, స్వచ్ఛంద పదవీ విరమణకు చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ ఆమోదం తెలిపింది.