భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు (ఏపీపీఎంబీ) విడుదల చేసింది. అనంతరం ఆయా మెడికల్ కాలేజీలు కూడా తమ కాలేజీల్లో సీట్ల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేశాయి. రెండేళ్ల కాల వ్యవధి గల పారా మెడికల్ (అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్) డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ లోగ దరఖాస్తులు అందించాలి. రాష్ట్రంలో మొత్తం తొమ్మిది మెడికల్ కాలేజీలు పారామెడికల్ డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మొత్తం 16 కోర్సులు, అందులో మొత్తం 1,002 సీట్లు ఉన్నాయి. అనంతపురం మెడికల్ కాలేజీలో ఏడు కోర్సుల్లో 72 సీట్లు ఉన్నాయి. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో రెండు కోర్సుల్లో 60 సీట్లు ఉన్నాయి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎనిమిది కోర్సుల్లో 101 సీట్లు ఉన్నాయి. గుంటూరు మెడికల్ కాలేజీలో పది కోర్సుల్లో 115 సీట్లు ఉన్నాయి. కడప మెడికల్ కాలేజీలో ఎనిమిది కోర్సుల్లో 120 సీట్లు ఉన్నాయి. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎనిమిది కోర్సుల్లో 70 సీట్లు ఉన్నాయి. కర్నూల్ మెడికల్ కాలేజీలో పది కోర్సుల్లో 121 సీట్లు ఉన్నాయి. విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీలో 12 కోర్సుల్లో 141 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం మెడికల్ కాలేజీలో 12 కోర్సుల్లో 205 సీట్లు ఉన్నాయి.
కాలేజీల పరిధిలో స్థానిక జిల్లాలు, స్థానికేతర జిల్లాల అభ్యర్థులకు 85:15 నిష్పత్తిలో సీట్లను కేటాయిస్తారు. శ్రీకాకుళం మెడికల్ కాలేజీ పరిధిలోకి శ్రీకాకుళం జిల్లా మాత్రమే వస్తుంది. అదే విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీ పరిధిలోకి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు వస్తాయి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ పరిధిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు వస్తాయి. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ పరిధిలోకి కృష్ణా జిల్లా మాత్రమే వస్తుంది. గుంటూరు మెడికల్ కాలేజీ పరిధిలోకి గుంటూరు, ప్రకాశం జిల్లాలు వస్తాయి. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలోకి నెల్లూరు, చిత్తూరు జిల్లాలు వస్తాయి. కర్నూల్ మెడికల్ కాలేజీ పరిధిలోకి కర్నూల్ జిల్లా మాత్రమే వస్తుంది. అనంతపురం మెడికల్ కాలేజీ పరిధిలోకి అనంతపురం జిల్లా మాత్రమే వస్తుంది.
అర్హతలు….
దరఖాస్తు దాఖలు చేయడానికి అభ్యర్థులు కచ్చితంగా బైపీసీతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒక వేళ బైపీసీ చేయకపోతే, ఎంపీసీ ఉత్తీర్ణత సాధించిన పారామెడికల్ డిప్లొమా కోర్సులకు అర్హత ఉంటుంది. ఎటువంటి ప్రవేశపరీక్ష లేదు. కేవలం మెరిట్ ప్రాతిపదికనే సీట్లు కేటాయిస్తారు.
రిజర్వేషన్లు
ఎస్సీ-15 శాతం, ఎస్టీ 6 శాతం, బీసీ 29 శాతం సీట్లు కేటాయిస్తారు.అడ్మిషన్ సందర్భంలో అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి. అప్లికేషన్ ఫీజును బ్యాంక్ అకౌంట్ నెంబర్ 014211010000021కి, ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సెక్రటరీ, విజయవాడ పేరు మీద క్యాస్ డిపాజిట్ చేయాలి. అడ్మిషన్ సమయంలో ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను అధికార వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని పూర్తి చేసి ఆగస్టు 6 తేదీ సాయంత్రం 5 గంటల లోపు చేసుకుని వైబ్ సైట్ ఉన్న అడ్రస్ కి పంపాలి. అప్లికేషన్కు ఎస్ఎస్సీ మార్కుల జాబితా, ఆధార్ కార్డు, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ప్రొసెసింగ్ ఫీజు వంద రూపాయాలు జత చేసి పంపాలి.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ దాఖలు ఆఖరు తేదీ- ఆగస్టు 6. కౌన్సెలింగ్, అభ్యర్థులను కాలేజీలకు కేటాయింపు- ఆగస్టు 19 వ తేదీ. తరగతులు ప్రారంభం- సెప్టెంబర్ 18వ తేదీ. మరిన్ని వివరాలను ఆయా యూనివర్శిటీల అధికారిక వైబ్ సైట్ లను సంప్రదించాలని అధికారులు సూచించారు.