భారత్ సమాచార్.నెట్: వేసవి కాలంలో (Summer Season) మన తీసుకునే ఆహారం (Food)లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేసవి కాలంలో ముఖ్యంగా కొన్ని మసాలాలకు (Masala) దూరంగా ఉండాలి. వాటి వల్ల శరీరంలో వేడి ఎక్కువై ఆకలి కాకపోవడం, డీహైడ్రేషన్, వడదెబ్బ, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు, స్కిన్ అలెర్జీల వంటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని వేసవిలో మసాలాలు తినకుండా ఉండటమే ఉత్తమం. ఇక వేసవిలో తినకూడని మసాలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి కాలంలో శరీరానికి చల్లదనంతో పాటు సరైన ఆహారం అవసరం. అయితే చాలామంది వేసవిలో కూడా మసాలా దినుసులను ఉపయోగిస్తారు. లవంగాలు, దాల్చిన చెక్క, బే ఆకులు, నల్ల మిరియాలు వంటి ఘాటైన సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి హానికరం. వీటితో పాటు అల్లం, వెల్లుల్లి, కారంపొడి కూడా వేసివిలో తక్కువగా తీసుకోవాలి లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మసాలా దినుసులోని లవంగం రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. కానీ వేసవిలో అధికంగా తీసుకుంటే తలనొప్పి, అజీర్ణం లాంటి సమస్యలు కలుగుతాయి. అలాగే నల్ల మిరియాలు శరీర వేడిని పెంచుతాయి. ఇది చర్మ సమస్యలకు దారితీయవచ్చు. దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్లతో సంవృద్ధిగా ఉన్నా వేసవిలో ఇది శరీరంలో వేడి కలిగిస్తుంది. ఇది వాంతులు లేదా అసిడిటీకి కారణమవుతుంది. దాల్చిన చెక్క లాగే అల్లం వెల్లుల్లి వేడి కలిగిస్తాయి. వీటికి కూడా వేసవిలో దూరంగా ఉంటే మంచిది.
అలాగే జాజికాయ రుచికి ఎంతో ఉపయోగపడుతుంది కానీ వేసవిలో అధికంగా తీసుకుంటే తల తిరగడం లేదా అలసట ఏర్పడుతుంది. ఇంగువ కూడా జీర్ణశక్తిని పెంచుతుంది కానీ వేసవిలో ఎక్కువగా వాడితే గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు కలుగుతాయి. వేసవి కాలంలో కారంగా ఉండే పదార్థాలను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాలను ఆహారంలో చేర్చడం ఉత్తమం. సోంపు, కొత్తిమీర పొడి, పచ్చి ఏలకులు వంటి వాటిని వాడటం మంచిది. అలాగే మజ్జిగా, నిమ్మకాయ, దోసకాయ, పుదీనా వంటి పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఈ కాలంలో వేడి పదార్థాల కన్న శరీరాన్ని చల్లబరిచే పదార్థాలు తీసుకోవడం మేలు.