భారత్ సమాచార్.నెట్: యమునోత్రి (Yamunotri), గంగోత్రి (Gangotri), కేదార్నాథ్ (Kedarnath), బద్రీనాథ్ (Bhadrinath)ల “చార్ధామ్” (Char Dham Yatra 2025) యాత్ర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఈ యాత్ర కోసం 9 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే 9 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కేదార్నాథ్ కి 2.75 రిజిస్ట్రేషన్లు, బద్రీనాథ్కి 2.2 లక్షల రిజిస్ట్రేషన్లు, గంగోత్రికి 1.38 లక్షలు, యమునోత్రికి 1.34, హేమకుండ్ సాహిబ్కి 8000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి.
అయితే ఈసారి చార్ధామ్ యాత్ర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యూట్యూబర్లు (Youtubers), సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ (Content Creators)పై నిషేధాన్ని విధిస్తున్నారు ఆలయ అధికారులు. కేదార్నాథ్- బద్రీనాథ్ పాండా సమాజ్ ఆలయ ప్రాంగణంలో వీడియోలు తీసే వారికి దర్శనాన్ని నిరాకరించి తిరిగి పంపించేస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, కేదార్నాథ్ ఆలయానికి 30 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కెమెరాలను నిషేధించాలని ఆలయ కమిటీ ఆదేశించింది. ఏ భక్తుడు కూడా సోషల్ మీడియాలో వీడియో కంటెంట్ క్రియేట్ చేయకుండా ఉండేందుకు దీనిని అమలు చేయనున్నారు.
ఇకపోతే ఏప్రిల్ 30న అంటే అక్షయ తృతీయ నుండి గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు తెరవడంతో యాత్రం ప్రారంభమవుతుంది. మే 2న, కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ యాత్ర సజావుగా సాగేందుకు హరిద్వార్, రిషికేష్, బ్యాసీ, శ్రీనగర్, రుద్ర ప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్, బార్కోట్, భట్వారీ,హెర్బర్ట్పూర్ వంటి 10ప్రాంతాల్లో యాత్రికుల కోసం హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సహాయం చేయడానికి మోటార్సైకిళ్లపై ప్రతి సెక్టార్లో ఆరుగురు పోలీసు సిబ్బంది మోహరించనున్నారు.