Homebreaking updates news'భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి వెళ్తే తిరిగొస్తామన్న నమ్మకం లేదు'

‘భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి వెళ్తే తిరిగొస్తామన్న నమ్మకం లేదు’

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రికొత్తగూడెం: సమాజంలో వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తాం. వైద్యసేవే పరమావధిగా ప్రార్థిస్తాం. కానీ దేవుళ్లుగా భావించే వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉంటుంది. అధికారుల పర్యవేక్షణ లోపం, వైద్యుల నిర్లక్ష్యంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి దారుణంగా మారింది. నిరుపేదలకు వైద్యం అందించడంలో వైద్యులు దాష్టికంగా ప్రవర్తిస్తున్నారు. డెలివరీ కోసం వచ్చే గర్భిణుల పరిస్థితి అయితే మరింత దారుణం అనే చెప్పాలి. హాస్పిటల్ లో వీధి కుక్కలు తిరుగుతున్నా, అపరిశుభ్రంగా ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో అసలు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి సూపరింటెండెంట్ ఉన్నాడా లేడా అన్న డౌట్ ఉత్పన్నమవుతుంది.

ప్రభుత్వాసుపత్రికి వెళ్తే తిరిగొస్తామనే నమ్మకం లేదు:
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చాలా వేదికలపై చెప్పిన విషయం తెలిసిందే. కానీ భద్రాచలం ప్రభుత్వాసుపత్రి మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తుందనే చెప్పాలి. వైద్యులు సమయపాలన పాటించకపోవడం, ఒక వార్డులో విధులు నిర్వర్తించాల్సిన వైద్య సిబ్బంది మరో వార్డులో పనిచేయడంతో రోగులు, గర్భిణులు తమ ప్రాణాలు పోతాయేమోనని భయాందోళనకు గురవుతున్నారు. పురిటినొప్పుల బాధ కంటే వైద్య సిబ్బంది వ్యవహరించే తీరుతోనే తమ ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో వణికిపోతున్నామని అక్కడకు వచ్చే గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రశంసలు సరే.. వైద్యసిబ్బంది పనితీరును పట్టించుకోరా..?
ప్రజారోగ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఇటీవల కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్‌లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సెప్టోప్లాస్టీతోపాటు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (FESS) చేయించుకున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఆమెను ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అభినందిస్తూ పబ్లిసిటీ చేసుకున్నారు. అదే సామాన్యుల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని రోగులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ జిల్లాకు బాస్ అనా లేదా సామాన్యులు ఉంటే ఏంటి, ఛస్తే ఏంటి అన్న చందంగా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యసిబ్బంది తీరు ఉండడంతో ప్రజలు మండిపడుతున్నారు.

నిండా నిర్లక్ష్యం.. పట్టించుకోని ప్రభుత్వం:
భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి ఓ వ్యక్తి తన భార్యను హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. వాళ్ల విషయంలో ఆస్పత్రి సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో కింద ఉన్న వీడియోలో చూడొవచ్చు. ఇంత పొగరు ఉన్నపుడు ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోవాలే కానీ ప్రభుత్వ వైద్యులుగా చలామణి కాకపోవడం ఉత్తమమం అని రోగులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు విషయం తెలియదా లేక ఆయన కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular