భారత్ సమాచార్.నెట్: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. అహమ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఆ సంస్థను వరుసగా సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి బయిలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని రియాద్కు మళ్లించారు. ఈ ఘటన జూన్ 21న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
జూన్ 21 AI-114 నెంబర్ గల ఎయిరిండియా విమానం రాత్రి 8.26 గంటలకు బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానం బయలు దేరిన తర్వాత కొంత సమయానికి విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ విమానాన్ని అత్యవసరంగా రియాద్కు దారి మళ్లించారు. రియాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా బయటికి తరలించి.. తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికులకు రియాద్లోని ఓ హోటల్లో వసతి ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి విమానాన్ని రియాద్లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉంచారు. కాగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న విమాన ప్రమాదాలు, విమానాలకు వస్తున్న బెదిరింపు కాల్స్ ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.