భారత్ సమాచార్.నెట్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించేందుకు మార్గాదర్శకాలను ఆమోదించింది సీబీఎస్ఈ. 2026 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
ఫిబ్రవరిలో నిర్వహించే మొదటి విడత పరీక్షలు తప్పనిసరి కాగా, మే నెలలో జరిగే రెండో విడత పరీక్షలను ఆప్షనల్గా పెట్టింది.
ఈ అంశంపై పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ మాట్లాడుతూ.. రెండుసార్లు పరీక్షలు నిర్వహించే నమూనాను సీబీఎస్ఈ ఆమోదించిందని తెలిపారు. ఈ ఏడాది మొదటి పరీక్ష ఫిబ్రవరిలో.. రెండో పరీక్ష మే నెలలో జరుగుతాయని వెల్లడించారు. ఫిబ్రవరిలో జరిగిన పరీక్ష ఫలితాలను ఏప్రిల్లో.. మేలో జరిగిన పరీక్ష ఫలితాలను జూన్లో ప్రకటిస్తామని తెలిపారు. విద్యార్థులపై బోర్డు పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు నూతన జాతీయ విద్యా విధానం సూచనల ప్రకారమే రెండు విడతల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అయితే పదో తరగతి బోర్డు పరీక్ష విద్యార్థులు మొదటి పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి. రెండో విడత పదో తరగతి పరీక్షలను ఆప్షనల్గా పెట్టింది. రెండు విడతల్లో మంచి స్కోర్ను పరిగణనలోకి తీసుకోనుంది బోర్డు. విద్యార్థులు తమ ఇష్టానుసారం రెండో బోర్డు పరీక్షలో పాల్గొనవచ్చు. మొదటిసారి మార్కులు తగ్గితే, మళ్లీ రెండోసారి రాసి మెరుగుపర్చుకోవచ్చు. మొదటి పరీక్షలో ఎక్కువ మార్కులు, రెండో పరీక్షలో తక్కువ మార్కులు సాధిస్తే మొదటి పరీక్షలో పొందిన మార్కులను ఫైనల్గా పరిగణిస్తారు.