భారత్ సమాచార్.నెట్: ఫాస్టాగ్ (Fastag) విషయంలో కేంద్రం (Central Govt) కీలక ప్రకటన చేసింది. నేషనల్ హైవేల (National Highways)పై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి టోల్ కలెక్షన్ (Toll Collection) విధానంలో కొత్త విధానం అందుబాటులోకి తెనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఏడాదికి ఒకసారి రిచార్జ్ చేసుకుని యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది వరకు లేదా 200 ట్రిప్పులు వరకు తిరిగే వెసులుబాటు తీసుకువస్తున్నట్లు తెలిపారు.
ఏడాదికి రూ.3 వేలు చెల్లిస్తే దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పిస్తూ కొత్త విధానం తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఇది అందుబాటులోకి రానుందని తెలిపారు. వాణిజ్యేతర, వ్యక్తిగత వాహన దారులు ఈ వార్షిక పాస్ వినియోగించుకోవచ్చు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ఈ పాస్ ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వార్షిక పాస్ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సజావుగా, ఖర్చుతో కూడుకున్న ప్రయాణాన్ని అనుమతిస్తుంది.
మరోవైపు ఫాస్టాగ్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. భారత రహదారి మౌలిక సదుపాయాల ప్రస్థానంలో దీన్ని గేమ్ ఛేంజర్గా అభివర్ణిస్తూ.. ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కేంద్రం నిర్ణయంతో ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్కు పరిష్కారం లభించినట్లవుతుందని పేర్కొన్నారు. టోల్ చెల్లింపులను సరళీకృతం చేస్తూ, ప్రయాణ ఖర్చులను తగ్గించడం ద్వారా ప్రైవేట్ వాహన యజమానులకు ఉపశమనం కలిగించేలా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్లను అమలులోకి తీసుకువస్తుందుకు నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.