భారత్ సమాచార్.నెట్: “చార్ధామ్” యాత్ర (Char Dham Yatra) అత్యంత ముఖ్యమైన హిందూ తీర్థయాత్రల్లో (Hindu Tirth Yatra ఒకటి. ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్రలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. చార్ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి (Yamunotri), గంగోత్రి (Gangotri), కేదార్నాథ్ (Kedarnath), బద్రీనాథ్ (Bhadrinath) పుణ్య క్షేత్రాలను భక్తులు దర్శించుకుంటారు. చార్ధామ్ (Char Dham Yatra 2025) యాత్ర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు.
అయితే చార్ధామ్ యాత్రలో భాగంగా కేదర్నాథ్ ఆలయ తలుపులు మే 2న తెరుచుకోనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రతినిధి తెలిపారు. అలాగే మే 4న బద్రీనాథ్ ఆలయం కూడా తెరుచుకోనున్నట్లు చెప్పారు. వీటితో పాటుగా రెండో కేదార్గా పిలువబడే మద్మహేశ్వర్ ఆలయ తలుపులను మే 21వ తేదీన, మూడో కేదార్ తుంగ గుడిని మే 02 తెరవనున్నట్లు వెల్లడించారు. ఇక గంగోత్రి, యమునోత్రి ద్వారాలు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నట్లు పేర్కొన్నారు.
ఇకపోతే ప్రతి శివ భక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ను సందర్శించాలని కోరుకుంటాడు. చార్ధామ్ యాత్ర యమునోత్రి నుండి ప్రారంభమై.. గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ప్రయాణాన్ని రోడ్డు లేదా ఆకాశ మార్గం ద్వారా చేయవచ్చు. హెలికాప్టర్ సేవలు కూడా చార్ధామ్ యాత్రకు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది భక్తులు దో ధామ్ యాత్రను చేపడతారు. కేదార్నాథ్ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే, పంచ కేదార్ తీర్థయాత్రలలో కేదార్నాథ్ ఆలయం మొదటిది. కాగా, విపరీతమైన మంచు కారణంగా కొన్ని రోజుల పాటే ఈ ఆలయాలు తెరుచుకుని ఉంటాయి.