భారత్ సమాచార్, జాతీయం ;
భారతదేశంలో 2024 జూలై 1 తేదీ నుంచి క్రిమినల్ చట్టాల్లో నూతన అధ్యయనం మొదలైంది. నేటి నుంచి ఏదైన కేసును ఫైల్ చేయాలనుకునే బాధితులు దేశంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. దీంతో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న చట్టాలు కనుమరుగు కానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందే.
Zero FIR : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన చట్టాలతో నేరాల బారినపడ్డ బాధితులు ఇకపై ఏ పోలీసు స్టేషన్ పరిధిలోనైనా ఫిర్యాదు చేయొచ్చు. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధి కాదంటూ ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసుస్టేషన్ సిబ్బంది నిరాకరించేందుకు వీల్లేదు. అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దానిపై సత్వరమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలి. ఆ తర్వాతే ఆ నేరం ఏ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిందో అక్కడికి బదిలీ చేయాలి.
అలాగే బాధితులు నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లకుండానే పోలీసు అధికారిక వెబ్సైట్, అధికారిక యాప్ సహా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పద్ధతుల్లోనూ ఫిర్యాదులు చేయొచ్చు. వాటిపై మూడు రోజుల్లోగా ఫిర్యాదుదారు సంతకం తీసుకుని ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలి. ఇప్పటివరకూ అమల్లో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్లో ఈ ప్రావిజెన్స్ లేవు. కేవలం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు జీరో ఎఫ్ఐఆర్లు (ZERO FIR) నమోదు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాల్లో ఈ మేరకు జీరో ఎఫ్ఐఆర్, ఈ-ఎఫ్ఐఆర్ (E-FIR) కు చోటు కల్పించారు. నేర ఘటనాస్థలం, అక్కడున్న పరిస్థితులు, ఆధారాలన్నింటినీ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలి. దీని కోసం ఇప్పటికే ఏపీలోని ప్రతి పోలీసుస్టేషన్కు ట్యాబ్లు అందజేశారు. వాటిల్లో రికార్డు చేస్తే అవి నేరుగా ఈ-సాక్ష్య యాప్లోకి వెళ్తాయి. భవిష్యత్తులో ఆయా నేరాల్లో నిందితులకు శిక్ష పడేలా చేయటంలో ఈ సాంకేతిక ఆధారాలు కీలకమవుతాయి.
వివరాలు నమోదుకు ప్రతి జిల్లాకు ఒక పోలీసు అధికారి : సెక్షన్ 37 ప్రకారం అరెస్టయినవారి పేర్లు, వారి చిరునామాలు, ఏ నేరాభియోగంపై వారు అరెస్టయ్యారనే సమాచార సేకరణ, ఆ రికార్డుల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఒక పోలీసు అధికారిని, ప్రతి పోలీసుస్టేషన్లో ఏఎస్సై(ASI) హోదా కంటే తక్కువ కాని అధికారిని నియమించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీసు కంట్రోల్ రూమ్లను నోటిఫై చేశారు. దృశ్యమాధ్యమ(Audio/video input) విధానం ద్వారా సాక్షులను విచారించేందుకు వీలుగా జిల్లా, మండల స్థాయిలో హైకోర్టు అనుమతితో నిర్దేశిత ప్రాంతాల్లో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్ గదులను నోటిఫై చేశారు. నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలీసు అధికారులు, సిబ్బందికి బీఎన్ఎస్ఎస్ (BNSS) చట్టాల్లోని అంశాల ప్రకారం అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే వీటన్నింటికీ సంబంధించి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇవన్నీ నేటి నుంచి అధికారికంగా భారతదేశం అంతటా అమల్లోకి రానున్నాయి.