భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting apps Promotion) అంశం రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States)ను కుదిపేస్తోంది. సోషల్ మీడియా సెలెబ్రిటీలతో ప్రారంభమైన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులు ఇప్పుడు టాలీవుడ్ (Tollywood)లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికి సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్లతో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నందమూరి బాలకృష్ణ (Balakrishna), రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), గోపీచంద్ (Gopichand)ల పేర్లు కూడా బయటకొచ్చాయి.
ఆహా (Aha) ఓటీటీ వేదికగా బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 2 షోలో నటుడు గోపీచంద్, ప్రభాస్, బాలకృష్ణ సంయుక్తంగా ‘Fun88’ అనే చైనీస్ బెట్టింగ్ యాప్ను సంయుక్తంగా ప్రమోట్ చేశారు అంటూ రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్కి ముగ్గురు హీరోలు కలిసీ ప్రమోషన్ చేశారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. హీరోల ప్రమోషన్తో చాలా మంది డబ్బులు నష్టపోయారని.. దీంతో ఆ ముగ్గురు సినీహీరోలపైనా కేసు నమోదు చేయాలని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లపై బ్యాన్..
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లపై కేంద్రం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం 357 బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఆ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసి.. రూ.126 కోట్ల నగదును ఫ్రీజ్ చేసింది. ఐటీ చట్టం కింద వాటిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వాటిని ఎవరూ ఉపయోగించవద్దని డీజీజీఐ హెచ్చరించింది. కాగా దేశవ్యాప్తంగా 700కు పైగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వీటి ద్వారా ప్రజలను మోసగిస్తూ పెద్ద ఎత్తున డబ్బులను విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తూ.. హవాలా మార్గంలో డబ్బును మళ్లిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.