భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: నీళ్లు, నీధులు, నియామకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా నీళ్ల పంచాయితీ ఇంకా తెగలేదు. తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లిబుల్లి మాటలు చెప్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అందుకే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం:
బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నీటిని రాయలసీమ ప్రాంతానికి మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమని వాదిస్తోంది. కృష్ణా నది ద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం నీటిని అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం కాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పింది. ఈ ప్రాజెక్టు గోదావరి నది నుంచి నీటిని మళ్లించి, కృష్ణా నదిలోకి, ఆపై నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా కొత్తగా నిర్మించబోయే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి మళ్లించాలని ప్రతిపాదించడంతో తెలంగాణ ప్రాంతానికి నష్టం కలుగుతుందని, ఈ ప్రాజెక్టు గోదావరి నది జలాల వినియోగానికి సంబంధించిన వివాదాలను మరింత పెంచుతుందని, తమ రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
అసలు బనకచర్ల ప్రాజెక్ట్ పంచాయితీ ఏంటంటే:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, రాయలసీమలో కరువు నివారణకు ఈ ప్రాజెక్టు చాలా అవసరమని స్పష్టం చేసింది. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 28 Jan 2025న ప్రతిపాదించడంతో గోదావరి– బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెరమీదికొచ్చింది. ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి నది జలాలను రాయలసీమకు మళ్లీంచేందుకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం చెలరేగింది.