భారత్ సమాచార్.నెట్: టీమిండియా స్టార్ క్రికెటర్ (Cricketer) రింకు సింగ్ (Rinku Singh), సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) ఎంపీ (MP) ప్రియ సరోజ్ (Priya Saroj)తో నిశ్చితార్థం (Engagement) జరిగింది. వీరి నిశ్చితార్థం వేడుక ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లఖ్నవూ(Lucknow) లోని ది సెంట్రమ్ అనే 5 స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు క్రికెట్ ప్రముఖులు, సినీ రాజకీయ రంగాల ప్రముఖులు, సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా రింకు సింగ్, ప్రియ సరోజ్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రింకు సింగ్, ప్రియా సరోజ్ ఇద్దరూ తెలుపు, గులాబీ రంగుల దుస్తులలో మెరిసిపోయారు. వీరి రాకతో ఫుల్క్రన్ హాల్ ఉత్సాహభరితమైన వాతావరణంతో నిండిపోయింది. హాల్ అంతా పూల అలంకరణలు, ప్రకాశవంతమైన లైట్లతో అద్భుతంగా ముస్తాబు చేశారు. 300 మందికి పైగా అతిథులు హాజరయ్యే సామర్థ్యం గల ఈ వేదికపై క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు.
ఈ నిశ్చితార్థ వేడుకకు ప్రత్యేక అతిథులుగా మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ రామ్గోపాల్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా, జయా బచ్చన్, శివపాల్ యాదవ్, తదితర రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అందరూ రింకూ, ప్రియా జంటను అభినందించారు. వారు అతిథులను పలకరించి వారితో ఫోటోలు దిగారు.
ఇకపోతే నవంబర్ 18న రింకు సింగ్, ప్రియా సరోజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. వారణాసిలో జరగనున్న వీరి వివాహానికి క్రికెట్, రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులకు ఆహ్వానం పంపనున్నారు. కాగా 27 ఏళ్ల రింకు సింగ్ భారత్ క్రికెట్ జట్టులో కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడే రింకు 2023లో గుజరాత్ టైటాన్స్పై ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు భారత్ తరఫున 2 వన్డేలు, 33 టీ20 మ్యాచ్లు ఆడిన రింకు క్రికెట్లో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు.
మరోవైపు, 26 ఏళ్ల ప్రియ సరోజ్ సమాజ్ వాదీ పార్టీ తరపున మచ్లీషహర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఉత్తరప్రదేశ్లో అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరిగా నిలిచారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ చేసిన ఆమె అమిటీ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేసింది. రాజకీయాల్లోకి రాకముందు సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.