Homemain slidesఇది మొండి ప్రభుత్వం కాదు..వినే ప్రభుత్వం

ఇది మొండి ప్రభుత్వం కాదు..వినే ప్రభుత్వం

భారత్ సమాచార్, అమరావతి ;

పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ “అధికారంలోకి రాక ముందు నుంచే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా ఆలోచనలు చేశాము. ఎన్నో సదస్సులు నిర్వహించాము. దేశంలో 70 శాతం ప్రజానీకం పల్లెల్లోనే ఉంటారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి ఆకాంక్షల మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికే ముందుకు తీసుకువెళ్తున్నాము. సర్పంచుల నుంచి వచ్చిన డిమాండ్లలో మొదట కీలకమైన వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తున్నాము. ఒకటికి పదిసార్లు చెప్పించుకునే పరిస్థితి లేకుండా చూస్తున్నాము. దేశంలోనే కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థ బలమైనది. అక్కడ పని చేసిన ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ అనుభవాన్ని వాడుకునేందుకు వీలుగా ఆయన్ని డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకువచ్చాము.

పల్లె వనం ద్వారా పంచాయతీల ఆదాయం పెంపు గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచేందుకు ఇప్పటికే పల్లెవనం కార్యక్రమానికి రూపకల్పన చేశాము. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పోషించేందుకు పల్లెవనం ప్రారంభించాము. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల ఆదాయం పెంచడంతో పాటు భూ ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మన దేశం ఏటా 20 వేల కోట్ల మెట్రిక్ టన్నుల పైచిలుకు కలప దిగుమతి చేసుకుంటోంది. మన దేశ అవసరాలకు సరిపడా కలప మనమే పెంచుకోగలిగే విధానాన్ని రూపొందిస్తున్నాము. వెదురు పెంపకంతో పాటు బయో డీజిల్ తీసే మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నాము. ప్రతి పంచాయతీ కలప పెంచే లక్ష్యాలను నిర్ధేశిస్తాము. దీంతో పంచాయతీల ఆదాయం పెరగడంతో పాటు పర్యావరణానికి ఉపయోగకరంగా ఉంటుంది.

పంచాయతీల ఖాతాలు ఫ్రీజ్ చేసే పద్దతిని తీసివేశాం. గత ప్రభుత్వం 12, 900 పంచాయతీలకు సంబంధించిన రూ. 8,629 కోట్ల నిధులను వివిధ మార్గాల్లో మళ్లించింది. వాటిని తిరిగి పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని సర్పంచులు అడిగారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఆర్ధిక శాఖ దృష్టికి తీసుకువెళ్తాము. 15వ ఆర్ధిక సంఘ నిధులు రూ. 750 కోట్లు త్వరలోనే పంచాయతీల ఖాతాలకు జమ అవుతాయి. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు వచ్చే నిధులను వేరు వేరు మార్గాలకు మళ్లించడం లేదు. ఏ పంచాయతీ నిధులు అక్కడే వినియోగం అయ్యేలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాము. ఇప్పటికే పంచాయతీల ఖాతాలు ఫ్రీజ్ చేసే పద్దతిని తీసివేశాము. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. గత ప్రభుత్వంలో కేంద్ర ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించేసుకున్నారు. పంచాయతీలకు రూపాయి కూడా ఇవ్వలేదు అని సర్పంచులు చెబుతున్నారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాలకు జవాబుదారీతనం లేదు. పాలసీలు అమలు చేయకుండా నిధులు ఇష్టారాజ్యంగా వాడేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కేబినెట్ లో చర్చిస్తాము.

వాలంటీర్లను గత ప్రభుత్వం మోసం చేసింది గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు పంచాయతీలకు సమాంతర వ్యవస్థలా తయారయ్యాయన్న అభిప్రాయం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ వేరు. సచివాలయ వ్యవస్థ వేరు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. జీతాలు పెంచుదామంటే జీవోలు ఎక్కడా కనబడడం లేదు. గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉన్నట్లు రికార్డులు ఉంటే ఆ వ్యవస్థను రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధుల గౌరవ వేతనం పెంచే అంశం పరిశీలనలో ఉంది. గ్రామ సభలు ఇంకా ప్రభావవంతంగా నిర్వహించాలి. తూతూ మంత్రంగా కాకుండా గ్రామ ప్రజలందరు అందులో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. సర్పంచుల సహకారం కూడా ఉంటే పల్లెల్లో అభివృద్ధిని మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకువెళ్తాము. రాజకీయ అంశాలు పక్కన పెట్టి ఎన్నికైన సర్పంచులకు గౌరవ స్థానం ఇవ్వడంతోపాటు ప్రథమ పౌరులుగా గుర్తించే అంశాన్ని పార్టీలకు అతీతతంగా ముందుకు తీసుకువెళ్తున్నాము. స్వయం పాలిత పంచాయతీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాము.

గ్రామీణ మంచి నీటి వనరుల సంరక్షణకు చర్యలు జల్ జీవన్ మిషన్ ని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీరు అందించాలన్నది ఆయన సంకల్పం. ఢిల్లీలో పెద్దలతో మాట్లాడుతున్న సమయంలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడాలి అనే అంశం చర్చకు వచ్చింది. తాగునీటి పైపు లైన్ల డిజైన్ లో తప్పులు ఉన్నాయి. సాంకేతికత సహాయంతో తప్పులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. రాజంపేటలో పర్యటనలో మా దృష్టికి వచ్చిన తాగునీటి సమస్యను 8 రోజుల్లో పరిష్కరించాము. మనసుతో పని చేస్తే సమస్యలు ఇట్టే పరిష్కారం అవుతాయి. 24 గంటలు నిరంతరాయంగా తాగు నీరు ఇవ్వాలన్న ప్రధాన మంత్రి లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మొదట గ్రామాల్లో ఉన్న చెరువుల పూడికలు తీయడం, గ్రామీణ మంచినీటి వనరులు రక్షించుకునే అంశం మీద దృష్టి సారించాలి.’’ అని ప్రసంగించారు. ఇది మొండి ప్రభుత్వం కాదు..వినే ప్రభుత్వమని, పంచాయతీల సమస్యలు వినేందుకు ప్రతి నెలా సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

టీడీపీ లిక్కర్ మాఫియా నడిపిస్తోంది…జగన్

RELATED ARTICLES

Most Popular

Recent Comments