భారత్ సమాచార్.నెట్: దేశంలో పైలట్ శిక్షణా కార్యక్రమాల నాణ్యతను పెంపొందించడం.. భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే విమాన శిక్షణా సంస్థల కోసం ర్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది డీజీసీఏ. ఇటీవల చోటుచేసుకున్న పలు విమాన ప్రమాదాలు, సంకేతిక సమస్యలు ఇతర లోపాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది.
ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త ర్యాంకింగ్ విధానం అమలులోకి రానున్నట్లు డీజీసీఏ పేర్కొంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు, అక్టోబర్ 1న, ఏప్రిల్ 1న ఈ ర్యాంకులను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపింది. శిక్షణా కేంద్రాల నాణ్యతను మెరుగుపర్చే లక్ష్యంతో పారదర్శకంగా నిర్వహించే పనితీరు ఆధారిత శిక్షణా విధానాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ పేర్కొంది.
ర్యాంకులు కేటాయించే ముందు డీజీసీఏ పలు కీలక కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థ మొత్తం స్కోరు 50 శాతం కంటే తక్కువగా ఉంటే.. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేస్తామని వెల్లడించింది. 85 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే A++, 70-85 శాతం ఉంటే A+, 70-50 శాతం ఉంటే ఏ ర్యాంకింగ్, 50 శాతం కంటే తక్కువ ఉంటే బీ ర్యాంకింగ్ ఇవ్వనుంది. అయితే బీ ర్యాంకింగ్ వచ్చిన సదురు సంస్థకు నోటీసులు జారీ చేయనుంది డీజీసీఏ. తద్వారా ఆయా సంస్థలు స్వయంగా సమీక్షించుకుని తమ శిక్షణా ప్రమాణాలను మెరుగుపర్చాలని ఆదేశించనున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.
Share This Post