భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అవలంభిస్తున్న విధానాలకు నిరసనగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మే 16వ తేదీన నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. దాంతో గులాబీ శ్రేణులు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విభిన్న పద్దతుల్లో అన్నదాతలకు మద్దతుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కొన్ని చోట్ల పోలీసులు బలవంతంగా నిరసనలను అడ్డుకుంటున్నారని గులాబీ నాయకులు ఆరోపిస్తున్నారు. శాంతియుత నిరసనలకు కూడా రాష్ట్రంలో తావు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
దుబ్బాక, చెన్నూరు, మిర్యాలగూడ, మహబూబ్ నగర్, కరీంనగర్ తదితర కేంద్రాల్లో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఎన్నికల్లో పండిన వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పి మళ్లీ నిన్నటి రోజున సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయటం శోచనీయం అన్నారు. అన్నీ రకాల వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించి, రైతాంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతే రాజు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుని మోసం చేస్తున్నారన్నారు.
కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి గులాబీ నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వినతి పత్రాన్ని అందజేశారు.