భారత్ సమాచార్.నెట్: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి సేకరించిన సీసీటీవీ కెమెరాలు, వెబ్కాస్టింగ్, వీడియో ఫుటేజ్ లాంటి ఎలక్ట్రానిక్ డేటాను.. ఎన్నికలు ముగిసిన 45 రోజుల తర్వాత తొలగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. తమ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ డేటాను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఈసీ పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డేటాను తొలగించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసి వెల్లడించింది.
మే 30న ఈ విషయమై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఈసీ లేఖలు పంపగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఎన్నికల సమయంలో వివిధ దశల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సీసీటీవీ, వెబ్కాస్టింగ్ చేయాలన్న సూచనలు ఇచ్చినట్టు ఈసీ గుర్తు చేసింది. అయితే,ఇది నిబంధనల ప్రకారం తప్పనిసరి ప్రక్రియ కాదని,కానీ ఈ రికార్డింగ్లు కమీషన్కు అంతర్గత విశ్లేషణకు ఉపయోగపడతాయని స్పష్టం చేసింది.
అయితే ఇటీవలి కాలంలో ఎన్నికల్లో పాల్గొనని కొందరు ఈ డేటాను తప్పుడు సమాచారం ప్రచారానికి వాడుతున్నట్టు ఈసీ గుర్తించింది. దీనివల్ల సోషల్ మీడియాలో విద్వేషాత్మక ప్రచారం జరుగుతోందని,ప్రజలను దారి తప్పించేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డేటాతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, సోషల్ మీడియాలో విద్వేషకర ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే ఆ డేటాను ఎన్నికలు జరిగిన తర్వాత 45 రోజులు మాత్రమే భద్రపరిచి.. అనంతరం వాటిని తొలగించాలని ఈసీ ఆదేశాలిచ్చింది